తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి రెండో సారి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏఐజీ డాక్టర్లు తెలిపారు. అయితే, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలా కరోనా బారిన పడడం గత రెండు నెలల వ్యవధిలో రెండోసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


గత ఏడాది నవంబరు 26న పోచారం శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి కరోనా సోకింది. అంతకుముందు నవంబరు 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎంలు కేసీఆర్‌, జగన్‌లతో పాటు పలువురు రాజకీయ, ఉన్నత అధికార వర్గాలు హాజరయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ పెళ్లి హడావుడి ముగిసిన వెంటనే తనతోపాటు కుటుంబసభ్యులకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లోనే స్పీకర్ పోచారానికి సహా పలువురు కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయింది. 


Also Read: ఓపెనింగ్‌ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్‌ నిద్రపోనివ్వదు.. దీనికి అలవాటు పడితే జీవితాలే నాశనం!


తాజాగా మళ్లీ రెండు నెలలు కూడా గడవక ముందే మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా సోకినట్లు ఫలితం వచ్చింది. పోచారం ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డోసులు రెండూ తీసుకున్నారు. అయినా రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది.


తెలంగాణలో కరోనా కేసులు


తెలంగాణలో తాజాగా 1963 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 22017కి యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1620 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్​ఎంసీలో 1075 మందికి కొవిడ్ సోకింది.


Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం


దేశంలో కేసులు



దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో ఆరువేల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోల్చుకుంటే ఐదు శాతం ఎక్కువ. కరోనా కేసులు సంఖ్య కూడా భారీగా రిజిస్టర్ అయ్యాయి. రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముఫ్పై మూడు కేసులు వెలుగు చూశాయి.