నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మల్కాపూర్లో మకిలీ రాయి మహత్యం అంతా ఇంతా కాదు. ఈ బండరాయి కింది నుంచి దూరి వస్తే పొట్ట సమస్యలు, అజీర్తి వంటి వ్యాధులు నయమవుతాయా...? అంటే అవును అంటున్నారు ఆ గ్రామస్తులు. తమకు ఇలాంటి సమస్యలు వస్తే.. దానికి పరిష్కారం ఓ బండరాయి చూపిస్తుందంటున్నారు. మీకు పొట్ట సమస్యలు ఏమైనా ఉన్నాయా.. తిన్నది అరక్క పోవడం, పేగులు మెలి తిరగడం అదే పనిగా కడుపునొప్పి రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే మీ సమస్యలకు గుండు వైద్యం అందుబాటులో ఉందంటున్నారు గ్రామస్తులు. ఇదేదో చేదు గుళిక కాదు. ఆపరేషన్ తో పని లేదు.. ఆది ఒక బండరాయి.. గుండు కింద నుంచి దూరితే నిజంగానే నడుము నొప్పులు, కడుపు నొప్పి, వెన్ను నొప్పులు నయమవుతాయని గ్రామస్తులు అంటున్నారు.
గుండు కింద నుంచి దూరితే 24 గంటల్లో.. పొట్ట సమస్యలు పోతాయట. ఇది మూఢనమ్మకం భావించేవారు కొందరైతే.. శాస్త్రీయంగా ఇది సాధ్యమని మరికొందరు అంటున్నారు. సాధారణంగా ఎవరికైనా కడుపు నొప్పి.. వెన్ను నొప్పి.. వస్తే డాక్టర్ ను సంప్రదిస్తారు. చికిత్స అనంతరం మందులు వాడుతారు.. ఇంకా తగ్గకుంటే ఎక్స్ రే, స్కానింగ్ ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ ఉండదు ఒక్కసారి మకిలీ బండ కింది నుంచి దూరితే నొప్పులు ఇకరావని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ బండరాయి దశాబ్దాలుగా ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని ఎలాంటి ఆధారం లేకుండా నిలబడింది. ఆ బండరాయి ఇప్పుడు గ్రామస్తులకు ఓ వైద్యశాలలా మారింది.. బండ కింద మనిషి పట్టేంత స్థలం ఉండకున్నా ఎంతో సునాయాసంగా దాని నుంచి బయటకు వస్తుంటారు. సన్నగా ఉన్నవారు, లావుగా ఉన్నవారు కూడా బండకింద నుంచి సునాయాసంగా వెళ్లడం ఈ గుండు ప్రత్యేకత.
మల్కాపూర్ లోని గుండు రాయికి మకీలీ రాయి అని పేరు రావడంతో మకీల్ సమస్యలున్న వారు ఇక్కడి వస్తుంటారు. గుండు వైద్యం కోసం హైదరాబాద్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా జనం వస్తుంటారని.. గుండు వైద్యం చేసుకుని వెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ మకీల్ నొప్పులు వచ్చిన వారు డాక్టర్ల వద్దకు వెళ్లకుండా గుండు వైద్యం చేసుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
గతంలో మల్కాపూర్ చుట్టుపక్కల చెరుకు పంటను బాగా పండించే వారు. చెరకు కోసే క్రమంలో కడుపులో మకిలీ పట్టుకుంటే పూర్వీకులు ఈ బండ కింది నుంచి వెళ్లేవారట. 24 గంటల్లోనే వారి సమస్య తీరేదని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్వీకులు కడుపులో సమస్య తలెత్తితే నేరుగా వచ్చి ఈ బండరాయి కింద దూరి వెళ్లేవారంట. ఈ రాయి సహజసిద్ధంగా వెలిసిందంటున్నారు గ్రామస్తులు. ఎలాంటి ఆధారం లేకుండా ఏళ్ల తరబడి ఇలాగే నిలబడి ఉందని తెలిపారు. తమ పూర్వీకులు అనుసరించిన విధానాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు.
Also Read: Hyderabad: ఆకలితో ఉన్న వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి.. గాయాలతో మృతి, ఆ పొరపాటే కొంపముంచింది!
Also Read: CPI News: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు
Also Read: Minister KTR: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి