నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో వరి పంట వేయొద్దని ప్రభుత్వం చెప్పేయడంతో... అన్నదాతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. యాసంగి పంట వేసేందుకు సమయం కూడా మించిపోతోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ సారి యాసంగికి ఎలాంటి వరి కొనుగోళ్లు చేపట్టేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో వరి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు తప్ప మరోమార్గం లేని పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అక్టోబరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించారు. పప్పుదినుసులు, ఆకు కూరలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఇతర వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని వివరించారు. మెజార్టీ రైతులు వరి పంటనే నమ్ముకున్నారు. ఖరీఫ్ తర్వాత యాసంగి ఇలా సంప్రదాయంగా పంటలు వేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.


వరే వేస్తాం, ప్రత్యామ్నయం వైపు వెళ్లం


నిజామాబాద్ జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరి పంటను ఎక్కువగా పండిస్తారు. మొక్కజొన్న, జొన్న, కూరగాయలు వంటి వాణిజ్య పంటలు తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే గత యాసంగిలో దాదాపు 3 లక్షల 74 వేల ఎకరాల్లో వరి పండించారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పటంతో రైతులు ఆయోమయంలో ఉన్నారు. జిల్లాలో సాధారణంగా రైతులు వరి పంటపైనే ఆసక్తి చూపుతారు. జిల్లాలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు. గతంలో ఖరీఫ్ పంట వేసి తర్వాత రైతులు యాసంగిలో చెరుకు పంటకు వెళ్లేవారు. అయితే ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు వరినే పండిస్తున్నారు. దీంతో ఖరీఫ్, యాసంగిలో పూర్తిగా వరి పంటనే వేస్తున్నారు. ఈ సారి జిల్లాలో సంవృద్ధిగా వర్షాలు కూడా కురవటంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు ఉండటం.... భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వరిపంటవైపే మొగ్గుచూపుతారు. కానీ ఆరుతడి పంటలు వేసేందుకు ఇది సమయం కూడా కాదని ఆందోళన చెందుతున్నారు.


అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి


వరి పంటను కాదని వేరే పంటల వైపు వెళ్దామన్నా.... విత్తనాల కొరత. మరోవైపు వరి పంటకు అలవాటైన నేల ఇప్పటికిప్పుడు ఇతర పంటలు వేస్తే దిగుబడి వచ్చే అవకాశాలు లేవని రైతులు అంటున్నారు. ఈ సారి యాసంగికి వరి సాగుకు అనుమతిచ్చి వచ్చేసారి నుంచి ఇతర పంటల వైపు మొగ్గుచూపుతాం. కానీ ఇలా ఉన్నట్లుండి సడన్ వరి పంటను వెెయ్యొద్దంటే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. వరి పంట వేస్తే ఒక వేళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పరిస్థితేంటన్న ఆందోళనలో కూడా ఉన్నారు రైతులు. ఇతర పంటలు వైేద్దామంటే పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అన్న మీమాంసలో ఉన్నారు. రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ప్రత్యామ్నయ పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కూడా కల్పించలేదన్న వాదన రైతుల్లో వినిపిస్తోౌంది. గతేడాది మొక్కజోన్న పంట వేసినా కొనబోమని ప్రభుత్వం చెప్పటంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇటు మొక్కజోన్న వైయాలా లేక వరి వేయాలా అసలేం చేయాలన్నది రైతులకు పాలుపోవటం లేదు.


Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?


Also Read: కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు..


Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి