నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.


నిజాం కాలంలో నిర్మాణం


నిజామాబాద్ జిల్లా చెరుకు రైతులకు సిరులు కురిపించే ఉద్దేశంతో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938లో తొలిసారి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎంతో లాభాల బాటలో పయనించింది. స్వాతంత్రం తర్వాత 1950లో ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో 13 యూనిట్లు ఏర్పాటు చేశారు. బొబ్బిలి, సీతానగరం, హిందూపూర్, జహీరాబాద్, మెట్‌పల్లి, మిర్యాలగూడ, చాగల్ డిస్లరీ, నాగార్జున సాగర్‌లో మిషనరీ డివిజన్, మెదక్‌లో షుగర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో నెఫా చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. షుగర్ ప్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారు. 14 వ్యవసాయ క్షేత్రాల్లో 16 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. చెరుకు పంట పండించేందుకే ఈ క్షేత్రాలను ఏర్పాటు చేశారు.  సుమారుగా 6 వేల మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు.


2002 లో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేటీకరణ


మెదక్, బోధన్, మెట్‌పల్లిలోని ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంఛర్ పేరిట నాటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రైవేటీకరించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా బలవంతంగా 1200 మందికి వీఆర్‌ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టెకోవర్ చేసుకున్నారు. గోకరాజు గంగరాజు 51  శాతం, ప్రభుత్వం 49 శాతం జాయింట్ వెంచర్‌లో ఫ్యాక్టరీని నడిపించారు. ప్రైవేట్ యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ప్రైవేట్ పరం కాగానే 20 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను కట్టి విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించేది ఫ్యాక్టరీ యాజమాన్యం.


కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన హామీలు నీటి మూటలే


2002 తర్వాత కార్మికులక వేతనాలు పెంచకపోవటంతోపాటు ఉన్న సౌకర్యాలు తొలగించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ పరంకాక ముందు గతంలో కార్మికులకు ఉండే అన్ని సౌకర్యాల్లో కోతలు పెట్టారు. రైతులకు చెరుకు బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవటంతో చెరుకు సాగును తగ్గించారు. ఇక 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంటామని జీవో విడుదల చేసింది. కార్మికుల ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2015లో గోకరాజు ఉన్నఫలంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండునే లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఆరేళ్ల నుంచి ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 40 మంది కార్మికులు గుండెపోటు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోయారు. 


ఫలించని కార్మికుల న్యాయ పోరాటం


ఉన్నఫలంగా ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. కేసును ప్రభుత్వం లేబర్ కోర్టుకు రిఫర్ చేసింది. గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అంగీకరించ లేదని కార్మికులు చెబుతున్నారు. అయితే గోకరాజు నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యూనల్‌ను ( NCLT) అప్రోచ్ అయ్యారు. రాజకృష్ణ గుప్తను లిక్విడేటర్‌గా అపాయింట్ చేసింది ఎన్సీఎల్టీ. కార్మికులు చేసిన క్లైంసిని లిక్విడేటర్ రాజకృష్ణ గుప్త అంగీకరించలేదు. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న సమయంలో 2019లో మార్చిలో ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి చెల్లింపులు జరపాలని చూసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు అమ్మొద్దని అప్పీల్ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ జడ్జిమెంట్ ఇవ్వకుండానే కేసును డిస్ మిస్ చేసింది.


అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఫ్యాక్టరీ తెరుస్తామన్న సీఎం కేసీఆర్


ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ఎటూ తేల్చకపోవటంతో కార్మికులు 6 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎందరి చుట్టు తిరిగినా ప్రయోజనం లేదని కార్మికులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు కార్మికులు. 200 మంది కార్మికులు 40 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 100 మంది కార్మికులు మిగిలారు. వారిలో కొంత మంది వయసు కుడా మీద పడింది. ఏ దిక్కు లేక కార్మికులు చిన్న చిన్న కిరాణ కొట్టులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాంటున్నారు. కనీసం తినటానికి తిండికూడా లేదని వాపోతున్నారు


విలువైన ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం


ఫ్యాక్టరీకి సంబంధించి 17000 ఎకరాల భుమి ఉండేది. ఎప్పుడైతే ప్రైవేట్ పరం కాగానే ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతమయ్యాయ్. చివరికి కేవలం 400 ఎకరాలు మాత్రమే మిగిలిందని కార్మికులు చెబుతున్నారు. ఒకప్పుడు కార్మికుల కోసం ఫ్యాక్టరీ పరిసరాల్లోనే 150 పడకల ఆస్పత్రి ఉండేది. నాణ్యమైన వైద్యం అందేది. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ కూడా ఉండేది. కార్మికులతోపాటు సామాన్య ప్రజలకు సైతం అక్కడ ఉచిత వైద్యం చేస్తుండేవారు. ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికుల కోసం సినిమా థియేటర్ కూడా ఉండేది. 14 వ్యవసాయ క్షేత్రాల్లో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఉండేది. కార్మికులకు సపరేట్ గా కో ఆప్షన్ బ్యాంక్, నిత్యావసరాలకు స్టోర్ కూడా ఉండేది. కార్మికుల క్వాటర్స్ లో ఉచిత నీటి సరఫరా, ఉచిత విద్యుత్, రెంట్ కూడా ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఫ్యాక్టరీ పూర్తిగా క్షీణ దశకు చేరుకుంది. ఫ్యాక్టరీ సామాగ్రి పూర్తిగా తుప్పుపట్టి పోయింది. ప్యాక్టరీ తిరిగి నడిపించాలనుకున్నా కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే. ఫ్యాక్టరీ ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పేరుగాంచింది నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ. అలాంటి గతమెంతో ఘనం అన్న చందంగా మారింది ఫ్యాక్టరీ పరిస్థితి. ఫ్యాక్టరీ తెరవటం దేవుడెరుగు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అయినా ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.