Rahul Gandhi Comments Against KCR: మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, సీఎం కేసీఆర్ స్కామ్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ మద్దతుతోనే కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ లు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. మొన్నటివరకూ రాష్ట్రంలో ముక్కోణపు పోరు ఉందని.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని చెప్పేవారు. కానీ తెలంగాణలో బీజేపీ లేనే లేదని.. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియదంటూ సెటైర్లు వేశారు రాహుల్. తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందని, ఒకేసారి కారు 4 టైర్లు పంక్ఛర్ అయితే ఎలా ఉంటుంతో ఇక్కడ బీజేపీ పరిస్థితి అలాగే ఉందన్నారు. కర్ణాటకలో ఓడించినట్లుగానే ఇక్కడ బీజేపీతో పాటు బీజేపీ బీ టీమ్ బీఎర్ఎస్ ను ఓడిద్దామని పార్టీ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు.


ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీఆర్ఎస్ ను పిలుద్దామని ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు సూచించారు. కానీ బీఆర్ఎస్ హాజరైతే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశామని గుర్తుచేశారు. బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని, ఆ పార్టీతో కలిసి సమావేశం, సభలలో పాల్గొనేది లేదన్నారు రాహుల్. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి, అవినీతి పాలనను అంతం చేస్తామన్నారు. కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడనున్నారు. మాతో కలిసి రావాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ భావజాలంతో ఉన్నవారికి తమకు ఏ సంబంధం లేదని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 


ప్రధాని మోదీ ఆశీస్సులు, మద్దతుతోనే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు కేసీఆర్, ఆయన ఫ్యామిలీ చేసిన కుంభకోణాల గురించి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ (బీజేపీ బంధువుల సమితి)గా మారిందన్నారు. కార్యకర్తలు, మద్దతుదారులే పార్టీకి వెన్నెముక. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు బీజేపీని ఓడించారో తెలంగాణలోనూ కార్యకర్తలు తమ సత్తా చాటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన కార్యకర్తలు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. తెలంగాణ పర్యటన ముగించుకున్న రాహుల్ తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.


ప్రతీ నెలా రూ.4,000 పింఛను అందిస్తామని రాహుల్ కీలక ప్రకటన చేశారు. ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసి వారి కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. కానీ బీజేపీ బీ టీమ్ అయిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిందంటూ మండిపడ్డారు. కొన్ని నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామన్నారు. 
Also Read: Ponguleti Joins Congress: కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial