Choutuppal Crime News: తండ్రి పెట్టే బాధలు భరించలేక స్కూల్‌లోనే దాక్కుందో బాలిక. తన తండ్రి అమ్మెస్తానంటూ బెదిరిస్తున్నాడని ఇంటికి వెళ్లనంటూ మారాం చేసింది. ఇంతలో ఆ తండ్రి వచ్చి స్కూల్‌లో గొడవ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బాలికను అధికారుల సంరక్షణలో ఉంచారు. 


హైదరాబాద్‌కు చెందిన అక్బర్ దంపతులు చాలా రోజు క్రితం చౌటుప్పల్‌ వచ్చి జీవిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. భర్తతో గొడవ పడ్డ భార్య తన కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్బర్‌ తన కుమార్తెతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన అక్బర్ నిత్యం ఆమెను వేదించడం మొదలు పెట్టాడు. భార్యపై కోపం వచ్చిన ప్రతిసారి 11 ఏళ్ల కుమార్తెపై కక్ష తీర్చుకోవడం అలవాటుగా మారింది. 


బుధవారం కూడా బాలికను చిత్రవధ చేశాడు. కొట్టి హింసించాడు. ఎవరికైనా అమ్మెస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది. చౌటుప్పల్ లోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక గురువారం స్కూల్‌కు రాలేకపోయింది. సాయంత్రానికి భయపడుతూనే స్కూల్‌కు వచ్చింది. జరిగిన విషయాన్ని స్కూల్ పిల్లలకు చెప్పింది. రోజంతా ఏం తినలేదని ఆకలిగా ఉందంటూ బోరుమంది. 


బాలిక పరిస్థితి గమనించిన స్నేహితులు విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వాళ్లు బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పి అన్నం తినిపించారు. స్కూల్ విడిచిపెట్టే టైం అయింది. రోజూ తన తండ్రి కొండుతున్నాడని... అమ్మెస్తానంటూ భయపెడుతున్నాడని చెబూతూ ఏడ్చింది. 


ఇంతలో ఇంటికి వెళ్లిన తండ్రికి పాప కనిపించలేదు. ఫుల్‌గా మద్యం సేవించి ఉన్న అక్బర్‌ నేరుగా స్కూల్ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. తండ్రి గొంతు విన్న బాలిక స్కూల్‌లోనే వేరే గదికి వెళ్లి దాక్కుంది. తండ్రితో వెళ్లబోనంటూ ఉపాధ్యాయులకు చెప్పేసింది. పాప భయపడుతోందని తర్వాత పంపిస్తామంటూ ఉపాధ్యాయులు చెబుతున్నా అక్బర్ వినిపించుకోలేదు. 


అక్బర్ చేసిన హంగమాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా బెదిరిపోయారు. ఇంతలో స్థానికులు ఎంఈవో, పోలీసులకు ఫోన్ ేచసి విషయాన్ని చెప్పారు. సమాచారం అందుకున్న వచ్చిన వారు అక్బర్‌తో మాట్లాడారు. వాళ్లపై కూడా తిరగుబాటు చేశాడు అక్బర్. 


చివరకు బాలికను మండల రిసోర్స్ సెంటర్‌కు తరలించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా బాలసదన్‌కు తీసుకెళ్లారు. తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 


Also Read: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు