ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సిమెంటు పరిశ్రమకు భారీగా డిమాండ్‌ ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, మహేంద్రనాథ్‌ పాండేలకు మంత్రి కేటీఆర్‌ ఆదివారం లేఖ రాశారు. దేశంలోని ప్రైవేటు సిమెంటు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని చెప్పారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అందులో పేర్కొన్నారు. కంపెనీని ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామన్నారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్‌ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కంపెనీ పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.


ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశామని, అటు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని వివరించారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్, 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా తాము భారీగా పెట్టుబడులు తెస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. తాము ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం సీసీఐ లాంటి కంపెనీలను తెరవకుండా ఉపాధి అవకాశాలను దెబ్బ కొడుతోందని విమర్శించారు. కేంద్రం మొండి వైఖరితో ఆదిలాబాద్‌ యువతకు తీరని ద్రోహం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !


సీసీఐ కోసం 2 కేవీ విద్యుత్‌ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందన్నారు. భౌగోళికంగా అదిలాబాద్‌కు ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని సీసీఐ యూనిట్‌ పునఃప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్‌ సప్లై చేసేందుకు వీలవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో టీఎస్‌ ఐపాస్ వంటి అద్భుతమైన విధానం రూపొందించామని.. తమ నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని గుర్తు చేశారు.


తమ ప్రయత్నాలు ఫలించి ఆదిలాబాద్‌లాంటి ప్రాంతాలకు సైతం నూతన పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఒరియంట్ సిమెంట్ తన దేవాపూర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు సుమారు రూ.1500 కోట్ల (215 మిలియన్ డాలర్లు) పైగా భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ లేఖలో కోరారు.






Also Read: తెలంగాణలో కరోనా ఆంక్షలు ఈ నెల 10 వరకూ.. నిబంధనలు మరింత కఠినం, పెరుగుతున్న పాజిటివిటీ రేటు


Also Read: GHMC: కరాచీ బేకరీకి జరిమానా.. ఓ నెటిజన్ ఫిర్యాదుతో చర్యలు, ఏం జరిగిందంటే..


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి