రాజకీయ నాయకుల మధ్య తరచూ విమర్శలు, ప్రతివిమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అధికార విపక్ష పార్టీల నేతలు ఏ స్థాయిలో దూషించుకుంటారో అందరికీ తెలిసిందే. పైకి శత్రువులుగా కనిపించే వారు.. ఒక్కసారిగా కలిసిపోయి కనిపిస్తే.. ఇక అది నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఓ పరిణామమే చోటు చేసుకుంది. అధికార విపక్షానికి చెందిన కీలక నేతలు ఓ కార్యక్రమం సందర్భంగా పక్కపక్కనే కూర్చొన్నారు. చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. వీరు ఎప్పుడూ కలిసి ఉండగా చూడని జనం.. ఓ దైవ కార్యక్రమం సందర్భంగా ఇలా చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


రాజకీయాల పరంగా పరస్ఫర భిన్న పార్టీలకు చెందిన వీరిద్దరూ కలుసుకొని పక్కపక్కనే కూర్చోవడం కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో కనిపించింది. అంతేకాక, పక్కనే ఇతర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లా రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు కూడా అక్కడే ఉన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న కల్యాణం సందర్భంగా స్వామి వారికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఉండగా.. ఇద్దరూ ఒకే చోట కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రతి విషయంలోనూ అధికార పార్టీని ఎండగడుతుండే కోమటిరెడ్డి.. మంత్రి హరీశ్ రావు ఒకేచోట కూర్చొని సంభాషించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


టీఆర్ఎస్‌పై తరచూ విమర్శలు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరచూ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసే సంగతి తెలిసిందే. తాజాగా ధాన్యం కొనుగోలు అంశంపైన కూడా తీవ్రంగానే స్పందించారు. ఆ విషయంలో టీఆర్ఎస్ పార్టీ దోషి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. హంగు, ఆర్భాటాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. రైతుల కోసం రెండు, మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించలేరా? అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని.. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత సీఎం కేసీఆర్ దే అంటూ వ్యాఖ్యలు చేశారు.


Also Read: ఈ ఛానెళ్లలో పని చేసేవాళ్లు జర్నలిస్టులే కాదు.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు 


మరోవైపు, మల్లన్న కల్యాణ మహోత్సవ ఏర్పాట్లతో కొముర‌వెల్లి సందడిగా మారింది. కొముర‌వెల్లి మ‌ల్లన్న కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమం వైభంగా జరిగింది. వీర‌శైవ ఆగ‌మంలో భాగంగా మ‌హా కుంభం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో కళ్యాణ వేడుక మొదలైంది. ఈ కార్యక్రమంలో ఈవో బాలాజీ, బార్శీ బృహ‌న్మఠాధీశులు సిద్ధగురు మ‌ణికంఠ శివాచార్యులతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో మల్లన్న వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడాలదేవీలను వివాహమాడారు. 


ఏటా మార్గశిర మాసం చివరిలో..
మార్గశిరమాసం చివరి ఆదివారం నిర్వహించే ఈ కల్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. తోటబావి ప్రాంగణాన్ని గ్యాలరీలుగా విభజించి భక్తులు కూర్చొనేందుకు ప్రత్యేకంగా టెంట్లు వేయించారు. ఆదివారం సాయంత్రం 7 గంట‌ల‌కు కొముర‌వెల్లి మ‌ల్లన్న ర‌థోత్సవం, సోమవారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఏకాద‌శ రుద్రాభిషేకం, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ల‌క్ష బిళ్వార్చన‌, మ‌హా మంగ‌ళ‌హార‌తి నిర్వహించ‌నున్నారు.


కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం ఇక్కడ లైవ్‌లో వీక్షించండి



Also Read: Money Tips Telugu: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...


Also Read: Hyderabad: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌‌కే కుచ్చుటోపీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి