Black Flag hoisted at Gangula Kamalakar House: తెలంగాణలో పండిన పంటను యథాతదంగా బేషరతుగా కేంద్రం సేకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం పంటలను కొనాల్సిన బాధ్యత, అధికారం కేంద్రానిదేనంటూ తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేశారు. తాము ఎవరినీ బిక్ష అడగట్లేదని, రాజ్యాంగ హక్కుల్ని సాధించుకుంటాం అన్నారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్, రైతుల పంటలు సేకరించేలా కేంద్రం  మెడలు వంచి తిరతామన్నారు.


తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరిధాన్యం కేంద్రం సేకరించాలని, మేం సూచించిన విదంగానే పంట పండించాలనే కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా రైతు ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కరీంనగర్‌లోని తన నివాసంలో నల్ల జెండా ఎగరేసిన అనంతరం మిడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతీ రైతు ఇంటిమీద నల్లజెండా ఎగరేసామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి విరమించుకొని బేషరతుగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొంటామనే వరకూ నల్లజెండా ఎగురుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.


కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇది గమనించారా ! 
నియోజకవర్గంలో దాదాపు 35,000 గృహాలపై రైతులతో పాటు వారికి మద్దతుగా నగరంలోనూ ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేసారన్నారు. ఇందులో కేవలం టీఆర్ఎస్ పార్టీ రైతులు మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు రైతులుగా కేంద్రానికి వ్యతిరేఖంగా నల్లజెండాలు ఎగరేసారని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇది గమనించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ రైతులపై బీజేపీకి కోపమున్నా కనీసం తమ బీజేపీ పార్టీకి చెందిన రైతులు ఎగరేసిన నల్లజెండాల్ని గమనంలోకి తీసుకొని వాళ్లకోసమైనా కేంద్రాన్ని యాసంగిలో ధాన్యం కొనాలని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా తమకు ఓటేసి గెలిపించిన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు.


రైతులను ఆందోళనలో నెట్టవద్దు.. 
సీఎం కేసీఆర్ రైతుబందు, బీమా, 24గంటల ఉచిత కరెంటు, నీళ్లిచ్చారు. ఇప్పుడిప్పుడే కోలుకొని కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పిడుగులాంటి నిర్ణయం తీసుకుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర రైతాంగం రైతాంగం భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లుతెరిచి యాసంగి పంటను కొనాలని సూచించారు. కేంద్రం కొనని పక్షంలో ఏప్రిల్ 11న సీఎం కేసీఆర్ నేతృత్వలో ఢిల్లీలో ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్, నేడు కేసీఆర్ సారథ్యంలో సైనికుల్లా పెద్ద బలం, బలగాన్ని ఉన్న టీఆర్ఎస్ కేంద్రం మెడలు వంచడం తథ్యమన్నారు, పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమం కన్నా తీవ్రంగా తెలంగాణ రైతాంగం పోరాటం ఉంటుందన్నారు.


యాసంగిలో బాయిల్డ్, వానాకాలంలో రా రైస్ ఎలా కొనుగోల్లు చేస్తున్నారో అలాగే చేయాలన్నారు, తెలంగాణలో ఉన్న ప్రత్యేక  వాతావరణ పరిస్థితులు భారత దేశం కన్నా విభిన్నంగా ఉంటాయన్నారు. అందువల్ల యాసంగిలో నూక శాతం పెరిగి పోవడంతో రా రైస్ ఇచ్చే పరిస్థితులు లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకోని బేషరతుగా యాసంగి ధాన్యంతో పాటు ఏ పంట పండించినా కొనుగోలు చేయాలన్నారు. మేం బిక్ష అడగట్లేదని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని 7వ షెడ్యూల్ 246 ఆర్టికల్ ప్రకారం పంటల సేకరణ అధికారం, బాధ్యత ఉన్న కేంద్రం సక్రమంగా నిర్వహించాలని అడుగుతున్నామని తెలిపారు. బేషరతుగా రైతులు పండించిన పంటను యదాతథంగా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి 


Also Read: Hanumakonda Road Accident: ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం - మరో 15 మందికి గాయాలు