Harish Rao Distributes Rs 1 Lakh Cheques: సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను కొనసాగించేలా చేసేందుకు తీసుకొచ్చిన పథకం బీసీ బంధు పథకం. బీసీ కుల వృత్తిదారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు వారికి రూ.1 లక్ష రూపాయల అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ 200 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను అందజేశారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాలకు చెందిన లబ్దిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు మంత్రి హరీష్ రావు.


సీఎం కేసీఆర్ చొరవతో బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ అనే మాట లేకుండా బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు నేరుగా రూ.1 లక్ష చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.  బీసీ కుల వృత్తిదారులకు చేయూతలో భాగంగా నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నట్లు మంత్రి హరీష్ చెప్పారు. వీటితో పాటు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తున్నారు.  నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు, చేనేత మిత్ర లాంటి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్కులను రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి సర్కార్ అందిస్తోంది.


ఆర్థిక బారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయాలు.. 
సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టామని, అదే విధంగా మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామన్నారు. రూ.600 కోట్ల వ్యయంతో మత్స్యకారులకు ద్విచక్ర వాహనాల పంపిణీ చేశామన్నారు. గీత కార్మికులకు చెట్లు పన్ను, పాత బకాయిల రద్దు చేసి వారికి ఆర్థిక బారాన్ని తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి పాత్రలను ప్రోత్సహిస్తుందన్నారు. అదుకోసం కుమ్మరుల అభివృద్ధికి సిద్దిపేటలో 2.20 కోట్ల రూపాయలతో మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు, మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు.
Also Read: JPS Recruitment: జేపీఎస్‌లకు గుడ్‌ న్యూస్‌, పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు


రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేవలం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 1012 ఏర్పాటు చేశామన్నారు హరీష్ రావు. జిల్లాలో ఒక ఎస్సీ డిగ్రీ రెసిరెన్షియల్ కాలేజీ ఉండగా, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. పేద విద్యా్ర్థులకు డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం నాలుగేళ్లుగా  ప్రయత్నిస్తున్నామని... ఇదివరకేసిద్దిపేటకు మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్స్‌ సాధించుకున్నాం అన్నారు. బి ఫార్మసీ కాలేజీని సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తామన్నారు. జిల్లాను చదువులో మెరుగైన జిల్లాగా మార్చుదామని, అందుకు నేతలతో పాటు అధికారులు సహకరించాలని కోరారు.
Also Read: Telangana News: పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ చేయడంలో తెలంగాణ టాప్- ఏపీది థర్డ్ ప్లేస్