తెలంగాణలో విధులు నిర్వ‌ర్తిస్తున్న జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు సంబంధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్)లను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 8) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్‌ల‌కు నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆదేశాల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పంచాయ‌తీరాజ్ శాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో అర్హులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. 70 శాతం మార్కులు రాని వారికి మరో ఆరు నెలలు అవకాశమిచ్చి, మళ్లీ ఆరు నెలల వరకు వారి పనితీరును పరిశీలించాక నియామకాలపై నిర్ణయం తీసుకోవాలంది. 


త‌క్కువ స్కోర్ చేసిన వారి ప‌నితీరును 6 నెల‌ల పాటు ప‌రిశీలించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఇక జేపీఎస్‌ల ప‌నితీరు, ఇత‌ర వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. నియామ‌క ఉత్త‌ర్వుల‌ను కూడా న‌మోదు చేయాల‌ని పేర్కొంది.


రాష్ట్రంలో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుండగా... వారిలో 5,435 మందే నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి మరో ఆరు నెలల తర్వాత నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వారి పనితీరుపై అధ్యయనానికి జిల్లాల్లో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో మదింపు కమిటీలను ఏర్పాటు చేసింది. జులై నుంచి వారు గ్రామాల్లో పర్యటించి కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ కమిటీలు నివేదికలు ఇచ్చాక 70 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికే పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం లభిస్తుంది.


జేపీఎస్‌లలో అసంతృప్తి..
తమను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జేపీఎస్‌లు ఆనందపడినా... నిబంధనలను చూసి తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తమను నేరుగా క్రమబద్ధీకరించకుండా... జిల్లాస్థాయి మదింపు కమిటీలను ఏర్పాటు చేసి, పాఠశాల విద్యార్థుల మాదిరిగా మార్కులు వేయిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నత విద్యావంతులమైన తాము మెరిట్ ద్వారా ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మదింపులో 70 శాతం మార్కులు రావాలని నిబంధన పెట్టడం సరికాదంటున్నారు. మార్కులు రానివారి పనితీరును మరో ఏడాదిపాటు పరిశీలిస్తామని చెప్పడమూ అన్యాయమేనని వాపోతున్నారు. ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం తమకు రెండేళ్ల శిక్షణ(ప్రొబేషనరీ) మాత్రమే అవసరమైనా... నాలుగేళ్లపాటు శిక్షణలోనే ఉంచిందని, ఆ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండానే నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో తాము రెండేళ్ల సర్వీసును నష్టపోయినట్లేనని పేర్కొన్నారు. 


నాలుగేళ్ల శిక్షణ కాలాన్నే సర్వీసుగా పరిగణించాలని వినతి
పంచాయతీరాజ్ శాఖ తీసుకొచ్చిన నిబంధనలు సమంజసం కాదని, వాటిని బేషరతుగా తొలగించాలని టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. జేపీఎస్‌ల నాలుగేళ్ల శిక్షణ కాలాన్నే సర్వీసుగా పరిగణించాలని కోరారు.


ఉత్తర్వుల కోసం క్లిక్ చేయండి..



ALSO READ:


TSPSC: ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ పాఠ‌శాలల‌కు సెల‌వులు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ప‌రీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే గ్రూప్-2 ప‌రీక్షల‌ు నిర్వహించనున్న పాఠ‌శాల‌ల‌కు ఆగస్టు 29, 30 తేదీల్లో సెల‌వులు ప్రక‌టిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చ‌ర్యలు తీసుకోవాల‌ని జిల్లా విద్యాధికారుల‌కు స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ శ్రీ దేవ‌సేన‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై ఇప్పటికే జిల్లాల క‌లెక్టర్లు, ఎస్‌పీలు, ఇత‌ర అధికారుల‌తో టీఎస్‌పీఎస్సీ అధికారులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వహించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...