Telangana: తెలంగాణలో రుణమాఫీపై ఇంకా చాలా మందికి అందలేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో లోన్‌ మాఫీ కాని వాళ్లకు మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అంలాటి వారి వివరాలు సేకరించేందుకు అధికారులను రంగంలోకి దింపింది. ప్రయోగాత్మకంగా వివరాలు నమోదు చేసిన అధికారులు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలోకి వచ్చి వివరాలు తెలుసుకోనున్నారు. 


అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. వ్యవశాయ శాఖ రూపొందించిన యాప్‌ ఆదివారమే క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. ఏలా వివరాలు నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి ఇస్తారు. 



తెలంగాణ వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావించింది. మూడు విడతలుగా ప్రక్రియ పూర్తి చేసింది. అయినా కొందరికి రేషన్ కార్డు లేదనో, ఇతర ధ్రువపత్రాలు లేవనో మాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇరుకున పడింది. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు ఈ యాప్‌తో క్షేత్రస్థాయి సిబ్బందితో సర్వే చేపట్టింది. 


Also Read: ప్రభుత్వ ఆఫీసులు కూడా కూల్చేస్తారా? హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఒవైసీ


మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయశాఖ సర్వే చేయనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకున్న తర్వాత పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదులు పరిశీలించిన అధికారులు... రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో మాఫీ కాలేదని తేల్చారు. అందుకే ఇలా నేరుగా వెళ్లి వివరాలు నమోదు చేసి మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 


ముందుగా ఫిర్యాదులు వచ్చిన రైతుల ఇంటికి అధికారులు వెళ్తారు. రుణఖాతాలు, ఆధార్‌ కార్డు, ఆధార్‌, ఇతర పత్రాలు పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటారు. వారి ఫొటోలు తీసుకుంటారు. వాటి ఆధారంగా రుణమాఫీకి సంబంధించిన వివరాలు, ఫోన్‌నెంబర్‌తో ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించి కుటుంబ యజమానితో సంతం తీసుకుంటారు. దీన్ని పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం అర్హులైన వారిని గుర్తించి రైతులకు రుణమాఫీ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. 


Also Read: తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- చైర్మన్ ఎవరంటే ?