Revanth Reddy inaugurated IIHT in Hyderabad | హైదరాబాద్‌: నగరంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే ఇప్పటివరకూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఐఐహెచ్‌టీ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా చర్యలు తీసుకోలేదన్నారు. మన రాష్ట్రానికి సైతం ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ (IIHT) ఉండి తీరాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఐఐహెచ్‌టీ గురించి తమ దృష్టికి వచ్చిన వెంటనే తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. 


ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీగా నామకరణం
ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారి చర్యలు ఎన్నటికీ త్యాగం అనిపించుకోవని, తెలంగాణ కోసం పదవిని వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగమని కొనియాడారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో ప్రారంభించిన IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జీవో విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.


బీఆర్ఎస్ పెండింగ్ బకాయిలు సైతం విడుదల 
‘తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచే ఇనిస్టిట్యూట్ (IIHT) మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించాం. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు చేశాం. వచ్చే ఏడాది నుంచి IIHT భవనం స్కిల్ యూనివర్సిటీలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.2500 స్టైఫండ్ ఇస్తాం. చేనేత కార్మికుల కళ్లలో ఆనందం చూసేందుకు మేం రూ.290కోట్ల బకాయిలు విడుదల చేశాం. గత ప్రభుత్వంలో సినీ తారళ తళుకు బెళుకులు తప్ప నేతన్నలకు ఏ ప్రయోజనం చేకూరలేదు. 


బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులకు బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఏడాది బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకున్నాం. తెలంగాణలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ఏడాదికి ఒక్కో సభ్యురాలికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతతో పాటు మంచి డిజైన్ తో ముందుకు రావాలని ఇదివరకే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.


చేనేత కార్మికులకు ఏడాదికి దాదాపు ఒక కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను ఇవ్వాలని భావిస్తున్నాం. సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. రూ.30 కోట్లున్న చేనేతన్నల రుణాలు మాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేస్తాం. రైతన్నతో పాటు నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా అందరికీ అండగా ఉంటా’ అన్నారు. 
Also Read: Heavy Rains: తీరం దాటిన తీవ్ర వాయుగుండం - ఏపీలోని ఈ జిలాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు వానలు