తెలంగాణలో నిరుద్యోగ పోరాటం పేరుతో వారం వారం దీక్షలు చేస్తూ వస్తున్న వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అడ్డా కూలీలు షాక్ ఇచ్చారు. ఆమె ప్రతి మంగళవారం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న వారిని పరామర్శించి దీక్షలో పాల్గొంటుంటారు. ఈ క్రమంలో ఈ మంగళవారం కూడా షర్మిల మేడ్చల్ జిల్లా ఫిర్జాదీగూడలో దీక్షకు పూనుకోగా.. అక్కడ అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.


ఈ దీక్ష కోసం వచ్చిన కూలీలు కొందరు మంగళవారం నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. ఫిర్జాదీగూడలో మహిళా అడ్డా కూలీలు ఆందోళన చేపట్టారు. వైఎస్ షర్మిల చేపట్టనున్న దీక్ష కోసం తమను స్థానిక పార్టీ నాయకులు తీసుకొచ్చారని, దీక్ష సమయం మొత్తం కూర్చుంటే రూ.400 ఇస్తామన్నారని కూలీలు చెప్పారు. తీరా వచ్చాక డబ్బులివ్వడం లేదని ఆరోపించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Also Read: Kothagudem: రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం


స్థానికంగా ఉన్న కెనరా నగర్ బస్టాపు వద్ద ఉన్న అడ్డా కూలీల వద్దకు వైఎస్సార్‌టీపీ నేత రాఘవ రెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో కూర్చుంటే ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తామని తమకు చెప్పారని కూలీలు వెల్లడించారు. అందుకు వారు ఒప్పుకోవడంతో 50 మందిని బస్సులో దీక్షా స్థలానికి తీసుకొచ్చారని వివరించారు. అయితే, షర్మిల దీక్షకు అనుమతి లేకపోవడంతో అందర్నీ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింగా పోలీసులు ఆదేశించారు.


Also Read: Today Weather Update: నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో మరో రెండు రోజులపాటు మోస్తారు వానలు


దీంతో ముందస్తు మాట ప్రకారం తకు తమకు డబ్బులివ్వాలని అడ్డా కూలీలు వైటీపీ నాయకులను అడగ్గా.. నేతలు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా అడ్డా కూలీలు నినాదాలు చేశారు. ఈ వ్యవహారాన్ని విలేకరులు కవర్ చేస్తుండడంతో వారి ఎదుట కూలీలు తమను తీసుకొచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు కూలీలకు నచ్చజెప్పి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. 


Also Read: TS RTC Charges: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగనుందా..! సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్న ఆర్టీసీ చైర్మన్


మరోవైపు, షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా షర్మిల దీక్షకు కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. షర్మిలను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను అడ్డుకోవడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.