Hyderabad: హైదరాబాద్‌లో ఓ బాలుడు చేసిన పని అందరికీ విస్మయం కలిగిస్తోంది. ఓ బాలుడు తన కన్న తల్లిదండ్రులను వదిలేసి మరోచోటికి పోయాడు. వెళ్లేటప్పుడు ఫోన్‌లో ఓ వీడియోను కూడా రికార్డు చేసి వెళ్లాడు. అందులో అతను చెప్పినది చూసి కన్న తల్లిదండ్రులు సహా స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఉన్న అమ్మా నాన్న తన సొంత వాళ్లు కాదని, పూర్వ జన్మలోని తన తల్లిదండ్రులే తన అసలు అమ్మా నాన్న అంటూ ఆ వీడియోలో బాలుడు చెప్పాడు. అందుకే వారి వద్దకు వెళ్లిపోతున్నట్లుగా సెల్ఫీ వీడియోలో రాశాడు. అది చూసి బాలుడి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ ఘటన హైదరాబాద్‌లోని న్యూ విద్యా నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నేరేడ్ మెట్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని న్యూ విద్యా నగర్‌లో నివాసం ఉండే దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారి వయసు ఒకరికి 15 ఏళ్లు కాగా, మరొకరికి 13 సంవత్సరాలు. అయితే, గత కొంత కాలంగా పిల్లలను భార్యను వదిలి భర్త మరో చోట నివాసం ఉంటున్నాడు. 


అయితే, పిల్లలు స్కూలుకు నేరుగా వెళ్లకుండా కరోనా లాక్ డౌన్ నుంచి ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంట్లోనే టీవీల్లో చూసి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు 13 ఈ నెల 1న స్మార్ట్ ఫోన్‌లో వీడియో రికార్డు చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ వీడియో ఓపెన్ చేసి చూడగా, తాను పూర్వ జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నానని పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన గత జన్మలోని తల్లిదండ్రులు తనకు గుర్తుకు వచ్చారని చెప్పాడు. ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు తన సొంత తల్లి తండ్రి కాదని, అందుకే వెళ్లిపోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బాలుగు కనిపించకుండా పోవడంపై కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలుడి ఆచూకీ ఎక్కడా దొరకలేదు. 


దీంతో చేసేది లేక తల్లిదండ్రులు నేరేడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని సెల్ఫీ వీడియోను పరిశీలించారు. బాలుడు చెప్పిన వివరాలు విని విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు బాలుడి ఆచూకీపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బాలుడి ప్రవర్తన ఎలా ఉండేదనే వివరాలను తల్లిదండ్రులను, బాలుడి సోదరుడ్ని అడిగి తెలుసుకుంటున్నారు.


Also Read: KCR On National Politics: ఫ్రంట్‌లు వద్దు, ఎల్లయ్యనో మల్లయ్యనో ప్రధానిగా కాదు! దేశానికి కొత్త అజెండా కావాలి - కేసీఆర్