టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆవిర్భావ వేడుకులు వైభవంగా నిర్వహించేందుకు భాగ్యనగరం గులాబీమయంగా మారింది. హైటెక్స్ సమీపంలో హెచ్ఐసీసీకు వెళ్లే రహాదారులకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలు, హోర్టింగ్ లతో స్వాగతాలు అతిథులను ఆకట్టుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరవై లక్షలకు పైగా కార్యకర్తలున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు వేల మంది ముఖ్యులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆరు వేల మందికి సరిపడా ఏర్పాట్లతో ఇప్పటికే హైటెక్స్ ప్రాణంగం సిద్ధమైంది.



33 రకాల వంటలు 


మంత్రులు కేటీఆర్, తలసాని, కమిటీలుగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏర్పాట్లను దగ్గరుండి పరశీలించారు. హెచ్ఐసీసీలో ఆరు నెల క్రితం ప్లీనరీ జరిగిన ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు కేవలం అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు, రుచికరమైన 33 రకాల తెలంగాణ వెజ్, నాన్ వెజ్ వంటకాలు వడ్డించేందుకు కేటాయించారు. ఇప్పటికే కూకట్ పల్లికి చెందిన 200 మంది వంట సిబ్బంది అతిథులకు వివిధ రకాల వంటలను సిద్దం చేస్తున్నారు. వాతావరణం వేడిగా ఉండటం, ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్లీనరీ కొనసాగనుండటంతో 50 వేల వాటార్ బాటిల్స్ తో పాటు ఈసారి ప్రత్యేకంగా అంబలిని అందరికీ అందించేలా ఏర్పాట్లు చేశారు. నోవాటెల్ ను ఆనుకుని ఉన్న విశాలమైన సమావేశమందిరంలో ప్రధాన సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేశారు. 


ట్రాఫిక్ ఆంక్షలు 


బుధవారం ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రాంతానికి చేరుకోవాలని, తెలంగాణ వ్యాప్తంగా ఆహ్వానాలు అందుకున్న ప్రజాప్రతినిధులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు, పట్టణాలు, మండల  పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్లు తప్పనిసరిగా రావాలని తెలిపారు. ప్రస్తుత కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందజేశారు. ఇలా మూడువేల మందికి పైగా అధికారికంగా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. హైటెక్స్ సమీపంలోని హెచ్ఐసీసీకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్లీనరికీ వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంతో పాటు ముందుగా అందరికీ పాస్ లు ఇవ్వడంతో పాస్ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. ప్లీనరీ ప్రాంతంలో విధులు  నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమైన సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎండలు విపరీతంగా కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలని సూచించారు.


పార్టీ కేడర్ కు దిశానిర్దేశం 


రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ ప్రజాప్రతినిధులు పేర్ల నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత 11.05 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. జెండా ఆవిష్కరణ తరువాత కేసిఆర్ ప్రారంభ ఉపన్యాసంతో మొదలయ్యే ప్లీనరీ సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనుంది. ఈ ఆవిర్భావ సమావేశంలో 11 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల తరువాత వాటిని ఇదే ప్లీనరీలో ఆమోదించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ఐప్యాక్ తో కలసి పనిచేసేందకు ఒప్పందం కుదుర్చుకున్న టీఆర్ఎస్, ఈ సమావేశంలో పార్టీ కేడర్ ను అందుకు అనుగుణంగా సన్నద్దం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు మొదలు క్షేత్రస్థాయి నాయకత్వం వరకూ కేసీఆర్ ప్లీనరీ వేదికగా ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారింది.