Hyderabad: హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కి ఓ గుడ్ న్యూస్. ఫుడ్ లవర్స్ లో చాలామందికి మిడ్ నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అలాంటి వారికోసమే ఈ స్పెషల్ న్యూస్. ఇకపై హైదరాబాద్ లో అర్థరాత్రి వరకు రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ నడుపుకోడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. గతంలో మెట్రో సిటీస్ అంతటికీ కొన్ని నిబంధనలను కేంద్రం తీసుకొచ్చినా, హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్యలు ఉండకూడదని మిడ్ నైట్ ఫుడ్, షాపింగ్ కల్చర్ ని పక్కనపెట్టారు. తాజాగా హైదరాబాద్ సిటీ కొత్త కమిషనర్ సీవీ ఆనంద్ ఆ నిబంధనలను పునరుద్ధరించారు. 


హైదరాబాద్ సిటీలోని టిఫిన్ సెంటర్లు, రోడ్ సైడ్ నిర్వహించే ఫుడ్ కోర్ట్ లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇకనుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరచి ఉంచేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఇవి తెరచి ఉంచుకోవచ్చు. ఈమేరకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు. ఇతర షాపులు మాత్రం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంచొచ్చు. లిక్కర్​షాపులకు మరో టైమ్ టేబుల్ ఉంది. లిక్కర్ షాపుల్ని ఉదయం 10 గంటలకు తెరవాలి. రాత్రి 11 గంటల ఠంచన్ గా మూసివేయాలి. 


ఇక కళాకారులకు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈనెల 28న ఎంజే మార్కెట్ లో గజల్ షాయరీ ఏర్పాటు చేశారు. GHMC ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం MJ మార్కెట్ ప్రాంగణంలో గజల్ షాయరీ నిర్వహిస్తారు. ప్రముఖ గజల్​ షాయరీ కళాకారులు తమ ప్రదర్శనలతో ఆహుతుల్ని అలరిస్తారు. ఈ గజల్ షాయరీకి సంబంధించి బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. 


సరస్ మేళా..
మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించే ఉద్దేశంతో సెర్ప్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో ఈనెల 27నుంచి సరస్ మేళా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు  సరస్ ​మేళా ఉంటుంది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం ఇక్కడ జరుగుతుంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. దాదాపు 250 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా.. వాటికోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. సరస్ మేళాలో చేనేత ఉత్పత్తులు, హ్యాండీ క్రాఫ్ట్స్, వెదురు, తుంగతో తయారీ చేసిన వస్తువులు, టెర్రకోట ఆర్టికల్స్, కొయ్యబొమ్మలు, వివిధ లోహాలతో చేసిన బొమ్మలు, మట్టిగాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చేనే కళాకారులు ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తారు. 


మెగా జాబ్ మేళా..
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు కూడా ఓ గుడ్ న్యూస్ ఉంది. ప్రైవేటు ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నవారు ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారులు సూచించారు. సెప్టెంబర్ 26న మల్లే పల్లిలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఎల్ఐసీ కంపెనీ 100 ఖాళీలను భర్తీ చేస్తోందని, వివరాల కోసం amwww.employment.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని, లేదా 53284 78933 ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలన్నారు. 


Also Read: దసరా నుంచి దీపావళి వరకు - అక్టోబర్‌లో బ్యాంక్‌లకు భారీగా సెలవులు