Narsingi Police Station: నార్సింగి పోలీస్టేషన్... హైదరాబాద్‌లోనే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులన్నీ కూడా సెలబ్రిటీలవే కావడంతో ఈ పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ అయిపోతోంది. ఓ వెలుగు వెలిగి, భారీగా అభిమానులను సంపాదించుకున్న సెలబ్రెటీలపై ఈ నార్సింగి పోలీస్టేషన్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్కరి పేరు ఒక్కో ఆరోపణతో ఎఫ్‌ఐఆర్ ఎక్కుతోంది. ఇలా కేసుల పరంపర చూస్తుంటే నార్సింగి పోలీస్టేషన్ సెలబ్రెటీ బాధితులకు అడ్డగా మారనుందా అనిపిస్తోంది. ఇంతకీ నార్సింగ్ పోలీస్టేషన్ ఈ మధ్యకాలంలో నమోదైన కేసుల గురించి ఓసారి చూస్తే మొదటి కేసు హీరో రాజ్ తరుణ్‌దే.


మొన్న రాజ్‌తరుణ్


బాధితురాలు లావణ్య  ఇచ్చిన ఫిర్యాదుతో జులై 10న హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, పదేళ్లపాటు కలిసి జీవించామని, అబార్షన్ అయిందని చెప్పుకొచ్చింది. మాల్వి మల్‌హోత్రా పరిచయంతో రాజ్ తరుణ్ మారిపోయి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ పై ఐపిసి సెక్షన్ 493,420,506 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. న్యాయవాదుల ఎంట్రీతో కేసు విచారణ ట్రైల్స్‌లో ఉంది. 


రాజ్ తరుణ్‌‌పై ఫిర్యాదు చేసిన నాటి నుంచి బాధితురాలు మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడటంపై శేఖర్‌ బాషా అనే ఆర్జే వ్యతిరేకించారు. ఇలా వివిధ టర్న్‌లు ట్విస్ట్‌లతో రాజ్ తరుణ్ కేసు కొద్ది రోజులుగా మీడియాకు మెయిన్‌గా సోషల్ మీడియాకు మంచి స్టఫ్ ఇచ్చింది. ఉయ్యాల ..జంపాల సినిమా నుంచి వినోదాత్మక సినిమాలతో అలరిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఇలా నార్సింగ్ పోలీసుల క్రైమ్ లిస్ట్‌లో చేరిపోయాడు. 


నిన్న జానీ మాస్టర్


రాజ్ తరుణ్ కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతుండగానే  మరో సెలబ్రెటీ, ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు రిజిస్టర్ అయింది. తనపై జానీ మాస్టర్ తనను వేధించారని ఓ లేడీ కొరియోగ్రాఫర్  ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీమాస్టర్‌పై కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. నార్సింగి పోలీసుల ఎప్‌ఐఆర్‌లో పేరు నమోదైంది. 


ఇవాళ హర్షసాయి


ఈ రెండు కేసులు పూర్తి కాకుండానే ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి రెండు కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోమంటే పట్టించుకోవడంలేదంటూ నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయి తండ్రిపై కూడా ఆరోపణలు చేసింది బాధిత యువతి. కోట్ల రూపాయలు దానం చేసే వీడియోలతో హర్షసాయి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు నార్సింగ్ పోలీసుల క్రైమ్‌ చిట్టాలో చేరిపోయాడు. 


ఇటీవల కాలంలో నార్సింగి పోలీసుల లిస్ట్‌లో చేరిన వీరంతా హైప్రొఫైల్ సెలబ్రెటీలు. ఒకరు పోతే మరొకరు అన్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. లిస్టులో చాలా మంది చేరుతున్నారు. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మాత్రం ఫిర్యాదు అంటేనే ఒత్తిడికి గురి అవుతున్నారు. 


Also Read: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు