హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజ్ ప్లాంట్లను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇందుకోసం కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీవ‌రేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం ప్రభుత్వం విడుద‌ల చేసింది. 


తాగునీటి స‌మ‌స్య 90 శాతం పూర్తి


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ ప్రజ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన ప్రక‌ట‌న చేస్తున్నానని తెలిపారు. హైద‌రాబాద్ విశ్వన‌గ‌రంగా ఎద‌గాలంటే మౌలిక వ‌స‌తులు ఉండాలన్నారు. దానికి అనుగుణంగా ఏడు సంవ‌త్సరాలుగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేప‌ట్టిందని పేర్కొన్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో తాగునీటికి స‌మ‌స్య లేకుండా చేశామన్న మంత్రి.. తాగునీటి స‌మ‌స్య 90 శాతం పూర్తయ్యిందన్నారు. ఎల‌క్ట్రిసిటీ విష‌యంలో కూడా స‌మ‌స్యల్లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. ప‌రిశ్రమ‌ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌కు 24 గంట‌లు నాణ్యమైన విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామని స్పష్టం చేశారు. హైద‌రాబాద్ వాట‌ర్ ప్లస్ సిటీగా పేరొందిందని గుర్తుచేశారు. 


 తాగునీటికి రూ.1200 కోట్లు


ఓఆర్ఆర్ లోప‌ల ఉన్న న‌గ‌ర శివారు ప్రాంతాల్లో మంచినీటి స‌మ‌స్యలను ప‌రిష్కరించాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయ‌న ఆదేశాలకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో తాగునీటి స‌మ‌స్యల‌ శాశ్వత‌ ప‌రిష్కారానికి రూ.1200 కోట్లతో 137 ఎంఎల్‌డీల సామ‌ర్థ్యం క‌లిగిన రిజ‌ర్వాయ‌ర్‌ల నిర్మాణానికి, 2100 కిలోమీట‌ర్ల పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుద‌ల చేసిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. దీని వ‌ల్ల శివారు ప్రాంతాల్లో దాదాపుగా 20 ల‌క్షల కుటుంబాల‌కు మంచినీటి స‌మ‌స్య తీరుతుంద‌న్నారు. 2 ల‌క్షల కొత్త మంచినీటి క‌నెక్షన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకే రోజు న‌గ‌రానికి దాదాపుగా రూ.5 వేల కోట్లను ప్రభుత్వం మంజూరు చేయ‌డం నిజంగా న‌గ‌ర ప్రజ‌ల‌కు గొప్ప శుభ‌వార్త అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల‌ను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి ప్రజ‌ల‌కు అందించాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిపారు.


Also Read: TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక


31 ప్రాంతాల్లో ఎస్టీపీలు


హైదరాబాద్ అధివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని చెరువులు, కాలువల శుద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ సహా ఓఆర్‌ఆర్‌ పరిధిలో 1,950 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే)ల మురికి నీరు ఉత్పత్తి అవుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ వరకు చూస్తే దాదాపు 1,650 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్పత్తి అవుతోందన్నారు.  అయితే హైదరాబాద్‌లో ప్రస్తుతం 772 ఎంఎల్‌డీలను శుద్ధి చేసే సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో 25 సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్‌టీపీ) పని చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని మరో 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రూ. 3,866 కోట్లు మంజూరు చేస్తూ జీవో 669ని జారీ చేసినట్లు తెలిపారు. 


Also Read: TS ICET Results 2021: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. 90.09 శాతం మంది పాస్.. టాప్ 15 ర్యాంకర్లు వీరే..


సీవ‌రేజి మాస్టర్ ప్లాన్ ముఖ్యాంశాలు


జీహెచ్ఎంసీలో 1650 ఎంఎల్‌డీ సీవ‌రేజి ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 25 సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి మొత్తం సామ‌ర్థ్యం 772 ఎంఎల్‌డీలు. జీహెచ్ఎంసీలో ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.78 శాతం ట్రీట్‌మెంట్ జ‌రుగుతోంది. మ‌రో 878 ఎంఎల్‌డీ మురుగు ట్రీట్‌మెంట్ జ‌ర‌గాల్సి ఉంది.


హైద‌రాబాద్ న‌గ‌రంలో సీవ‌రేజ్ మాస్టర్‌ ప్లాన్ రూప‌క‌ల్పన కోసం ప్రభుత్వం ముంబయికు చెందిన షా టెక్నిక‌ల్ కన్సెల్టెంట్‌ను నియ‌మించింది. ప్రస్తుతం(2021) న‌గ‌రంలో 1950 ఎంఎల్‌డీ(1650 ఎంఎల్‌డీ జీహెచ్ఎంసీలో, 300 ఎంఎల్‌డీ ఓఆర్ఆర్ ప‌రిధిలో) మురుగు ఉత్పత్తి అవుతోంది. 2036లో 2,814 ఎంఎల్‌డీ, 2051లో 3,715 ఎంఎల్‌డీ మురుగు ఉత్పత్తి అవుతుంద‌ని ఈ సంస్థ అంచ‌నా వేసింది. మొత్తం 62 సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాల‌ని ఈ సంస్థ ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 31 సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓఆర్ఆర్ ప‌రిధిలో 31 నిర్మించాల‌ని సూచించింది.


జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎస్‌టీపీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించింది. జీహెచ్ఎంసీలో మొత్తం 3 ప్యాకేజీల్లో 1259.5 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యం ఉండేలా 31 ఎస్‌టీపీల నిర్మించాల‌ని ప్రతిపాదించ‌డం జ‌రిగింది. ఓఆర్ఆర్ ప‌రిధిలో ద‌శ‌ల‌వారీగా ఎస్‌టీపీల నిర్మాణం చేప‌ట్టాల‌ని సంస్థ సూచించింది.


Also Read: RGV : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?


మెట్రో న‌గ‌రాల్లో హైద‌రాబాద్ మొద‌టిస్థానం


జీహెచ్ఎంసీ ప‌రిధిలో 100 శాతం సీవ‌రేజి ట్రీట్‌మెంట్ జ‌రిపేందుకు గానూ 1259.5 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో ఉండేలా 31 సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి, 15 ఏళ్ల ఓ ఆండ్ ఎంకు రూ.3,866.21 కోట్లకు ప్రభుత్వం ప‌రిపాల‌నా అనుమ‌తులు మంజూరు చేసింది. ప్రస్తుతం, భ‌విష్యత్‌లో న‌గ‌రంలో ఉత్పత్తి అయ్యే సీవ‌రేజిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయ‌డానికి ఈ ఎస్‌టీపీలు స‌రిపోతాయి. ఈ 31 ఎస్‌టీపీలు ప్రారంభం అయితే సీవ‌రేజి ట్రీట్‌మెంట్ విష‌యంలో అన్ని మెట్రో న‌గ‌రాల్లో హైద‌రాబాద్ మొద‌టిస్థానంలో ఉంటుంది. 


Also Read:  CM KCR Delhi Tour: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి