Breaking News Live: విత్తన పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Feb 2022 02:45 PM
డీసీసీబీ బ్యాంక్ లో 1.60 కోట్లు షేర్ కాపిటల్ పక్కదారి

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం డీసీసీబీ బ్యాంక్ లో 1.60 కోట్లు షేర్ కేపిటల్ ను ప్రక్కదారి పట్టించారు. బ్యాంక్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగే కీలక సూత్ర దారి అని భావిస్తున్నారు. కేవలం మూడు నాలుగు ఇంటి పేర్లతో ఉన్నవారిని ఎంపిక చేసుకొని షేర్ కేపిటల్ నుంచి సుమారు కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు తెలిసింది. దీనిపై ఆప్కాబ్ అధికారుల బృందం అరా తీసింది. ఒక ఉద్యోగి ఐడీ ద్వారా షేర్ కేపిటల్ సొమ్మును దారిమళ్లించి డీసీసీబీ అకౌంట్ ల ద్వారా నగదును డ్రా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై  ఎంక్వైరీ  అధికారి డీజీఎం వెంకటేశ్వరరావు రికార్డుల ను ,ఆన్లైన్ లావాదేవీలను పరిశీలించారు. బ్యాంక్ లో షేర్ కేపిటల్ గోల్ మాల్  చేసిన  ఉద్యోగిని విధుల నుండి తొలగించారు.

కూకట్ పల్లిలో హైటెక్ పేకాట రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో హైటెక్ పేకాట రాకెట్ గుట్టురట్టయింది. లోథా అపార్ట్‌మెంట్స్‌లో హైటెక్ పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు.. మాదాపూర్ ఎస్వీటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హైటెక్ పేకాట నిర్వహిస్తున్న మురళి అనే వ్యక్తిని పట్టుకున్నారుమరో 13 మందిని కూడా అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం రూ.లక్షన్నరకు లోథా అపార్ట్‌మెంట్‌లో మురళి ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్నారు. సంపన్నులు నివసించే లోథా అపార్ట్మెంట్‌లో స్వేచ్ఛగా నిర్వహిస్తున్న పేకాట కేంద్రం కోసం వాట్సాప్ ద్వారా సమాచారం అందించి అందరద్నీ రప్పించేవాడు. వీరి నుంచి రూ.2.52 లక్షలతో పాటు 13 మొబైల్ ఫోన్స్, 10 సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

Jagityal News: తల్లిదండ్రులకి న్యాయం కావాలని రోడ్డెక్కిన పిల్లలు - కలెక్టర్, ఎస్పీని చేరాలని విజ్ఞప్తి

తన తండ్రికి అన్యాయం జరిగిందంటూ ఇద్దరు పిల్లలు రోడ్డెక్కడం.. చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కా తమ్ముళ్లు తన తండ్రికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు. కొంత మంది తమ తల్లిదండ్రులను మోసం చేశారంటూ, వారిని గుర్తించి పట్టుకోవాలని వేడుకున్నారు. ఈ మేరకు ఆ పిల్లలు ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘‘జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సార్ గారికి, జిల్లా ఎస్పీ సింధు శర్మ గారికి. సార్, మేడమ్ నా పేరు సాత్విక ఐదవ తరగతి చదువుతున్నాను. ఇతను మా తమ్ముడు. మా డాడీని కొందరు నమ్మించి మోసం చేశారట. మా డాడీకి న్యాయం చేయగలరు. మమ్మీ డాడీలను మమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి బతికి ఉన్నప్పుడే న్యాయం చేయండి తర్వాత చేస్తే ఏమి లాభం. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి దయచేసి చేరేలా చేయండి.’’ అంటూ ఆ పిల్లలు వేడుకున్నారు.

విత్తన పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

రాజేంద్రనగర్ సర్కిల్ లో 6.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్ రావు, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ల్యాబ్ లో విత్తనాలను పరీక్షించారు. ఈ విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఈ పరిశోధన కేంద్రంలో పరీక్ష చేసి ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. దేశంలోని ఈ పరీక్ష కేంద్రం రెండవ అతి పెద్ద పరీక్ష కేంద్రంగా పేరొందింది. అంతర్జాతీయ విత్తన పరిశోధనా సంస్థ అనుమతులతో ఈ పరీక్ష కేంద్రంలో నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.

Earth Quake in Indonesia: ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్​ స్కేల్​ పైన 6.2 తీవ్రత నమోదైనట్లు యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. బుక్కిటింగి ​ప్రాంతానికి 66 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది.

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఎంపీపీ కుమారుడు

కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీ రాధ కుమారుడు రాహుల్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. నాలుగు నెలల క్రితమే ఎంబీబీస్ చదువు కోసం అతను అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లోని ఓబ్లాస్ట్ అనే రాష్ట్రం ఇవానో ఫ్రాoక్విస్క్ నగరంలోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో రాహుల్ మెడిసిన్ చదువుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండడంతో రాహుల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గంటకొకసారి ఫోన్లో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ వారిని జాగ్రత్తగా తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.

Pawan Kalyan: హైదరాబాద్ పోలీసులకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

హైదరాబాద్‌లో భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహణకు సహకరించిన తెలంగాణ పోలీసులకు జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌ కళ్యాణ్‌ గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, జనాలకు అవాంతరాలు లేకుండా యడంలో, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఉదయం 11 గంటలకు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం వైఎస్ సమీక్ష

అమరావతిలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని శాఖల నుంచి అధికారులు ప్రతిపాదనలు తీసుకున్నారు. ఆయా శాఖల నుంచి వచ్చిన తిపాదనలు, కేటాయింపులపై సీఎం జగన్ చర్చిస్తారు.

Jagityal: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థిని తల్లిదండ్రుల ఇంటికి బండి సంజయ్

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. నిహారికతో వీడియో కాల్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులెవరూ ఆందోళన పడొద్దని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అక్కడున్న అందరినీ సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నిహారిక చదువుకుంటున్న వర్సిటీలో తెలుగు వాళ్ళందరి ఫోన్ నంబర్లు పంపితే అందరితో మాట్లాడి భారత్ తీసుకొచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతామని భరోసా కల్పించారు.

Adoni Student in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆదోని యువకుడు

ఉక్రెయిన్‌లో ఓ ఆదోని యువకుడు చిక్కుకున్నాడు. జెబ్రజియో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి మెడిసిన్ చదువుతున్నాడు. ‘‘యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్నాను. ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నాను. మా పక్క నగరం కార్గియూలో దాడులు జరుగుతున్నాయి. మేముండే ప్రాంతానికి కూడా ట్రూప్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇండియన్ ఎంబసీ నుంచి సరైన సమాచారం రావడం లేదు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఏయిర్ పోర్టులలో చిక్కుకున్నారు. వారి పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. భారత ప్రభుత్వం ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా తీసుకెళ్తే బాగుంటుంది’’ అని మెడిసిన్ విద్యార్ధి అరుణ్ కుమార్ వాపోయారు.

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తగ్గడంతో వేడి ప్రభావం చూపుతోంది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజామున, రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 25 డిగ్రీల మేర నమోదు కావడం వాతావరణంలో మార్పులను స్పష్టంగా సూచిస్తుంది.


ఏపీలో నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్షాలు లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురం, బాపట్ల, నందిగామ, కళింగపట్నం, అమరావతి, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు చేరే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో పొడి గాలులు పెరగడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత తప్పదు. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడిగా ఉంటుంది.  ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో  కనిష్ట ఉష్ణోగ్రతలు 25కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి భారీగా ఎగబాకింది. గ్రాముకు ఏకంగా రూ.125 చొప్పున ఎగబాకిపోయింది. వెండి కూడా అదే దారిలో గ్రాముకు రూ.2.70 పెరిగి కిలోకు రూ.2,700 పెరిగిపోయింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.72,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700 వేలుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.