Breaking News Live Telugu Updates: జహీరాబాద్ మండలంలో బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Dec 2022 08:52 PM
జహీరాబాద్ మండలంలో బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో దారుణం


* కుటుంబ కలహాలతో వ్యవసాయ బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య


* మృతులు రాజగిరి వెంకటి, రాజగిరి లక్ష్మీ గా గుర్తింపు


* మృతి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు


* బావిలోంచి మృతదేహాలను వెలికితీత చర్యలు చేపట్టిన చిరాగ్ పల్లి పోలీసులు

టి.కాంగ్రెస్ లో సంక్షోభం, 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా 

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతల ఆరోపణలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మాకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కి రాజీనామా లేఖలు పంపారు.   

Hyderabad News: పసికందును వదిలేసి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఒకరోజు వయసు ఉన్న పసికందును ఓ అపార్ట్‌మెంట్ పక్కన పడేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. కమలానగర్ లో రెండు అపార్ట్మెంట్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పసికందును పడేసి వెళ్లిపోయారు. దీనిని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని గాయాలు పాలైన పసికందును ఆస్పత్రికి తరలించారు.

వరంగల్ నిట్‌కు చేరుకున్న హైకోర్ట్ చీఫ్ జస్టిస్ భుయాన్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి

తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వరంగల్ నిట్ కు చేరుకున్నారు.  హై కోర్ట్ జడ్జీలు నవీన్  రావు, నగేష్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి సైతం నిట్‌కు చేరుకోగా స్వాగతం పలికారు.
 

Siddipet News: సిద్దిపేటలో వైఎస్ షర్మిల పుట్టిన రోజు వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టిపి నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి, ఆస్పత్రిలో రోగులకు పండ్లను, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ షర్మిల 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేలా షర్మిలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూమాఫియా, అవినీతి పెట్రేగిపోయిందని, దానికి వ్యతిరేకంగానే షర్మిల పార్టీని పెట్టి ప్రజలకు అండగా పోరాడుతోందని అన్నారు. షర్మిల ఉద్యమానికి తెలంగాణ ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె గద్దించి, హుస్నాబాద్ గడ్డపై వైఎస్ఆర్టిపి జెండాను ఎగురవేస్తామన్నారు.

Srisailam News: శ్రీశైలం క్షేత్రంలో అనుమతి లేకుండా డ్రోన్ చక్కర్లు

 


శ్రీశైల మహాక్షేత్రంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. క్షేత్రపరిధిలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు డ్రోన్ తిరుగుతూ ఉండటాన్ని స్థానికులు గమనించి దేవస్థానం అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమై దేవస్థానం అధికారులు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందిని పంపడంతో సిబ్బంది చాకచక్యంగా డ్రోన్ ను వెంబడించి డ్రోన్ ని ఆపరేట్ చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. డ్రోన్ కెమెరాను సీసీటీవీ కంట్రోల్ రూమ్ కు తరలించి విచారణ చేస్తున్నారు. అయితే, డ్రోన్ కెమెరా స్థానికంగా జరుగుతున్న ఓ వివాహానికి తెచ్చినట్లుగా సమాచారం. అయితే దేవస్థానం అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో డ్రోన్లను ఎగిరేయకూడదని తనకు తెలియదని డ్రోన్ ఎగరేసిన వ్యక్తి తెలపడంతో డ్రోన్ ను శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.

Harish Rao: కొమురవెళ్లి మల్లన్నకు బంగారు కిరీట ధారణ చేసిన హరీష్ రావు

కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు.

Step Father Murders Daughter: సెల్‌ఫోన్ మాట్లాడుతుందని కూతుర్ని చంపిన మారు తండ్రి

  • ముషీరాబాద్ పీఎస్ పరిధిలో కూతురుని గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన పిన తండ్రి

  • ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో  హత్య

  • యాస్మిన్ ఉన్నిసా (17) కూతురిని మారు తండ్రి సాదిక్ గొంతు నులిమి హత్య

  • యాస్మిన్ తల్లిని రెండో వివాహం చేసుకున్న నిందితుడు

  • ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంలో ఘటన 

  •  కూతురిని చంపిన అనంతరం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు మహమ్మద్ తౌ ఫి అలియాస్ సాదిక్

  • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు

Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహుర్తం ఫిక్స్, యాత్ర పేరు ఏంటంటే

తెలంగాణలో మరో పాదయాత్ర మొదలుకాబోతోంది. 'సకల జనుల సంఘర్షణ' పేరుతో జనవరి చివరి వారం నుండి 5 నెలలపాటు నిర్విరామంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పాదయాత్ర కొనసాగుతుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. 

Background

ఏపీ, తెలంగాణలో ఈ వారం చివ్వరి వరకు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. కాబట్టి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు. తెల్లవారుజామున కొన్ని చోట్ల పొగ మంచుతో మొదలైయ్యే వాతావరణం, మధ్యాహ్నానికి కాస్తంత వెచ్చగా ఉంటుందని, రాత్రికి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయని అంచనా వేశారు. ఈ వారం చివర్లో అంటే ఈ శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.


అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


‘‘వచ్చే వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా లేదు. దీని కోసం ఒకటి లేదా రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ వస్తుంది. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుంది. 
1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదు.
2) వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఈ రెండు జిల్లాల్లోనే వర్షాలు
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. విజయవాడకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఈ రెండు రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఆగ్నేయంగా తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.