ఉత్తర్‌ప్రదేశ్‌(Uttara Pradesh)లో ఈ నెల 22న జగరనున్న అయోధ్య(Ayodhya) రామమందిర..... ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ  సభ్యులు... విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు. దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ఎంపీలు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు ఇచ్చినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలిపారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు.... ఆహ్వానం అందింది. ముంబయి(Mumbai)లోని కోహ్లీ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.  అఫ్గాన్‌నిస్థాన్‌(Afghanistan)తో మూడో టీ20 ఆడటానికి బెంగళూరు బయల్దేరడానికి ముందు స్వయంగా ఆహ్వానాన్ని స్వీకరించడానికి కోహ్లీ ముంబయికి వచ్చినట్లు తెలుస్తోంది. వేడుకకు వెళ్లేందుకు విరాట్ కొహ్లీ బీసీసీఐ అనుమతి కూడా తీసుకున్నారు. ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, వెంకటేశ్ ప్రసాద్ లకు ఆలయ కమిటీ ఆహ్వానాలు ఇచ్చింది.


రాముడిపై కుల్‌దీప్‌ అభిమానం
మైదానంలో దిగాడంటే ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిరిగే బంతులతో ముప్పు తిప్పలు పెట్టే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండగా.. కుల్దీప్ యాదవ్ టాలెంట్ వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. శ్రీరాముడు, ఆంజనేయుడి పెయింటింగ్స్ వేశాడు. రే అనే నెటిజన్ కుల్దీప్ పెయింటింగ్స్ ను ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేశాడు. ప్రొఫెషనల్ పెయింటర్స్ తరహాలో కుల్దీప్ వేసిన శ్రీరాముడు, అంజనీ పుత్రుడు హనుమాన్ చిత్రాలు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మైదానంలో ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ టాలెంట్ మాకు తెలుసునని, ఆఫ్ ద ఫీల్డ్ కుల్దీప్ ఇలా దేవుడి బొమ్మల్ని ఎంతో శ్రద్ధగా గీస్తాడని.. ఇది దేవుడు తనకు ఇచ్చిన గొప్ప టాలెంట్ అని కామెంట్ చేస్తున్నారు. 


తరలిరానున్న అతిరథ మహారథులు
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ర్టేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంగ్‌ కాంగ్‌, కెనడా,ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌... సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నట్లు..... విజ్ఞానానంద తెలిపారు. దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జనవరి 20న లఖ్‌నవూకు చేరుకొనున్న విదేశీ అతిథులు... జనవరి 21న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారని వివరించారు. పొగ మంచు, వాతావరణ పరిస్థితులు కారణంగా అతిథులు..... ముందుగానే కార్యక్రమానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దసంఖ్యలో విదేశీ అతిథులను పిలవాలని అనుకున్నామని కానీ అయోధ్య చిన్న నగరం కావడంతో పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు ఇచ్చినట్లు వెల్లడించారు.


Also Read: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి 


Also Read: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా