Ayodhya Ram Mandir Inauguration News: అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ (Ram Mandir Pran Pratishtha) క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి. సరయు నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి 22వ తేదీ రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణప్రతిష్ట క్రతువులు ప్రారంభమైన సందర్భంగా ఆలయ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి.



రామాలయ సముదాయంలో బంగారు పూతతో కూడిన 14 గేట్లు ఏర్పాటు చేశారు. వాటిపై ఏనుగు, తామర, నెమలి మొదలైన బొమ్మలు చెక్కబడ్డాయి. తలుపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ తెలిపింది. 



శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం.. ఆలయం 1,000 ఏళ్లు నిలిచేలా నిర్మించబడింది. వెయ్యి సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదు. ఆలయ నిర్మాణంలో సిమెంటు, కాంక్రీటు, ఇనుము ఉపయోగించలేదు.



ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు.



మొత్తం మూడు అంతస్తుల్లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. 



ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు, శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద ఆలయాన్ని దర్శించుకోవాలంటే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందే కదా. అలాంటి వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.  



ఆలయ గర్భగుడిలో బాల రాముడు రూపంలో కనిపిస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్ పూర్ నుంచి గులాబి రంగు బన్సీపహార్ పూర్ సాండ్ స్టోన్‌ను వినియోగించారు.



రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయ్ లాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్‌లాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం నమూనాను ఒకటి థాయ్ లాండ్‌లో నిర్మించారు.


రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లనుంది. 


నేటి నుంచి ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు



  • జనవరి 16: అయోధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం  ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ చేపట్టారు.

  • జనవరి 17: రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.

  • జనవరి 18: గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు నిర్వహిస్తారు.

  • జనవరి 19 : యజ్ఞం ప్రారంబంకానుంది. తర్వాత 'నవగ్రహ' 'హవన్' స్థాపన జరుగుతుంది.

  • జనవరి 20: రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో కడుగుతారు, ఆ తర్వాత వాస్తు శాంతి 'అన్నాధివాస్' ఆచారాలు జరుగుతాయి.

  • జనవరి 21: రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.

  • జనవరి 22: ప్రధాన "ప్రాణ్‌ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.

  • జనవరి 23: భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జనవరి 21 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి భక్తులను రానివ్వరు.