భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్‌ వీడ్కోలు ప్రణాళికలు వెల్లడించింది. 2022 ఏడాది ఆఖర్లో ఆటకు గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఆమె ఓటమి చవిచూసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది.


'నా చివరి సీజన్‌ ఇదేనని నిర్ణయించుకున్నా. ఇక నుంచి వారం వారం సమీక్షించుకుంటాను. నిజానికి ఈ సీజన్‌ చివరి వరకు కొనసాగుతానో లేదో చెప్పలేను. సాగిపోవాలని అనుకుంటున్నా' అని సానియా మీర్జా తెలిపింది. తన కఠిన నిర్ణయం వెనక కారణాలను ఆమె వెల్లడించింది.


'ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే నేను ఆడతాను అని సింపుల్‌గా అనుకోలేను. ఎందుకంటే నేను కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. కలిసి ప్రయాణించడం వల్ల నా మూడేళ్ల కొడుకును రిస్క్‌లో పెడుతున్నాను. నిర్ణయం వెనకకు ఇదే కీలకంగా నిలిచింది' అని సానియా పేర్కొంది.


'నేను త్వరగా అలసిపోతున్నాను. గాయాల పాలవుతున్నాను. ఈ రోజు నా మోకాలు చాలా ఇబ్బంది పెట్టింది. కేవలం దానివల్లే ఓడిపోయానని చెప్పను. నా వయసు పెరగడం వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది' అని సానియా మీర్జా వెల్లడించింది.


ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో సానియా ఓటమి పాలైనా ఆమె ఇంకా అక్కడే ఉండనుంది. అమెరికా కుర్రాడు రాజీవ్‌ రామ్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. ఇప్పటి వరకు సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. డబుల్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీఏ సింగిల్స్‌లో టాప్‌-30లో ప్రవేశించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ఆమె పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.


Also Read: Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!


Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్‌!


Also Read: Lucknow IPL Franchise: కేఎల్‌ రాహుల్‌ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!