How Flag Controversy Saw Indias Navdeep Singh Clinch Javelin Throw F41 Gold Medal : పారిస్‌ పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో అనూహ్య  ఘటన జరిగింది. మరుగుజ్జులకు నిర్వహించే  F41 విభాగంలో పురుషుల జావెలిన్ ఫైనల్‌ జరిగింది. ఈ విభాగంలో పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి మరీ ఇరాన్ పారా అథ్లెట్  స్వర్ణం సాధించాడు. భారత్‌కు చెందిన నవదీప్‌ రజతం సాధించాడు. ఫైనల్ కూడా ముగిసింది. ఈ ఫైనల్ ముగిసిన తర్వాతే ఒలింపిక్ నిర్వహక కమిటీ కీలక ప్రకటన చేసింది. స్వర్ణం గెలిచిన ఇరాన్ అథ్లెట్‌ సదేగ్ షాయ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో భారత్‌కు స్వర్ణం గెలిచింది. ఇంతకీ ఈ ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు ఎందుకు పడిందంటే....



 

వేటు ఎందుకు పడిందంటే..?

పారాలింపిక్స్ 2024లో ఇరానియన్ అథ్లెట్ సదేగ్ షాయ్‌.. తన అయిదో త్రో తో పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణాన్ని గెలిచాడు. మరుగుజ్జులకు నిర్వహించే F41 విభాగంలో 47.32 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి సాధించాడు. అయితే పారాలింపిక్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదేగ్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో రజతం సాధించిన నవదీప్‌కు స్వర్ణం దక్కింది. పారాలింపిక్ కమిటీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పదే పదే జెండాను ప్రదర్శించినందుకు అతనిపై వేటు పడింది. తొలుత సదేగ్‌కు ఎల్లో కార్డ్ చూపించామని... అయినా అతడు మళ్లీ మళ్లీ జెండా చూపించడంతో అతడిపై అనర్హత వేటు పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ నిబంధనల ప్రకారం 'స్పోర్టింగ్ ప్రవర్తన' కారణంగా సదేగ్ షాట్‌పై పోటీ నుంచి తొలగించబడ్డాడని ఒలింపిక్‌ నిర్వహక కమిటీ ప్రకటించింది.

 

ఏమిటా రూల్‌..

అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రవర్తనా నియమావళిలోని రూల్ 8.1ని ఉల్లంఘించినందుకు సదేగ్‌పై అనర్హత వేటు వేశారు. పారాలింపిక్స్‌లో ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేకపోతే వారిని పోటీల నుంచి నిషేధిస్తారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ నియమాలు 8.1 ప్రకారం పారా అథ్లెటిక్స్ క్రీడలో సమగ్రత, నైతికతస ప్రవర్తన అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, నిర్వాహకులతో సహా క్రీడలో పాల్గొనే వారందరు ఈ ప్రమాణాలను నిలబెట్టేందుకు కట్టుబడాలి. క్రీడను న్యాయంగా, నిజాయతీగా, పారదర్శకంగా నిర్వహించేలా చూసుకోవాలి. కానీ ఇరాన్ అథ్లెట్‌ సదేగ్‌... పోటి సమయంలో పదే పదే నల్లజెండాను ఎగురవేస్తూ కనిపించాడు. ఇది అనుచిత ప్రవర్తనగా భావించిన ఒలింపిక్ నిర్వహక కమిటీ నిషేధం విధించింది. కచ్చితంగా ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని... స్పష్టం చేసింది.  

 

తటస్థ అథ్లెట్లుగా

విశ్వ క్రీడల్లో నల్ల జెండాలు ఎగరవేయడం, అనుమతి లేని జెండాలను, గుర్తులను చూపించడం నిబంధనలకు విరుద్ధం. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యా, బెలారస్ అథ్లెట్లు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడుతున్నారు. పారిస్ పారాలింపిక్స్ 2024లో జెండాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సదేగ్‌పై అనర్హత వేటుపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అధికారికంగా అప్పీల్ చేసింది.