అండర్-19 ప్రపంచకప్ యువ భారత్ అదరగొడుతోంది. తన చివర లీగ్ మ్యాచ్ లో పసికూన ఉగాండాను బెంబేలెత్తించింది. ఇప్పటికే భారత్ క్వార్టర్స్ లో బెర్త్ ఖరారు చేసుకోంది. ఉగాండాతో మ్యాచ్ లో రాజ్ బవా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన యువ భారత్ ఉగాండాపై 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రాజ్‌ బవా 162 నాటౌట్ చేయగా, రఘువంశీ 144 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఉగాండాకు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆ జట్టు 19.4 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్‌ పాస్కల్‌ మురింగి (34) పోరాడినా ఫలితంలేకపోయింది. 






ఉగాండా ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు. భారత కెప్టెన్‌ నిషాంత్‌ సింధు ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌వర్ధన్‌ హంగారేర్కర్‌ 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌-బిలో టాప్ ప్లేస్ కు చేరింది. గ్రూప్‌-ఎలో ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, గ్రూప్‌-సిలో పాకిస్థాన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, గ్రూప్‌-డిలో శ్రీలంకతో పాటు ఆస్త్రేలియా జట్లు క్వార్టర్స్ చేరాయి. 


Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!


శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ 


శిఖర్ ధావన్ 18 ఏళ్ల ఫీట్‌ను రాజ్ బావా బ్రేక్ చేశాడు. ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో రాజ్ బావా అజేయంగా 162 పరుగులు చేశారు. 16 ఏళ్ల రాజ్ బావా అండర్-19 ప్రపంచ కప్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 2004 U19 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌పై ఢాకాలో అజేయంగా 155 పరుగులతో రికార్డు సృష్టించాడు. 


Also Read: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?