Women's T20 World Cup 2024, India vs New Zealand Highlights:


భారీ అంచనాలతో మహిళల టీ 20 ప్రపంచకప్‌లో(Women's T20 World Cup 2024 బరిలోకి దిగిన భారత జట్టు(Team India)కు తొలి మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. న్యూజిలండ్‌(New Zealand)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కనీసం పోరాడకుండా ఓడిపోవడం.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 102 పరుగులకే పరిమితమై... 58 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. ఇక ఆదివారం జరిగే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌.. భారత్‌కు కీలకంగా మారనుంది. 

 


 

కివీస్‌ ధనాధన్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లను కివీస్‌ బ్యాటర్లు సునాయసంగా ఎదుర్కొన్నారు. కివీస్ ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ఫ్లిమ్మర్‌ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు కేవలం ఏడు ఓవర్లలో 67 పరుగులు జోడించి న్యూజిలాండ్‌.. భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరూ 67 పరుగుల వద్దే వెనుదిరిగారు. దీంతో భారత బౌలర్లు పుంజుకున్నట్లే కనిపించారు. అ తర్వాత కివీస్ కెప్టెన్‌ సోఫీ డివైన్ అర్ధ సెంచరీతో న్యూజిలాండ్‌కు భారీ స్కోరు అందించింది. కేవలం 36 బంతుల్లో 57 పరుగులు చేసిన సోఫీ నాటౌట్‌గా నిలిచింది. సోఫీ  ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు ఉన్నాయి. సోఫీ.. బ్రూక్ హాలిడేతో కలిసి నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే భారత ఫీల్డర్ల తప్పులు కూడా న్యూజిలాండ్‌కు కలిసివచ్చాయి. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లతో పర్వాలేదనిపించింది. కానీ మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దీప్తి శర్మ నాలుగు ఓవర్లలోనే 45 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేదు. భారత జట్టు ఈ మ్యాచ్‌ కోసం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఈ ఏడాది భారత జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. అయినా టీమిండియాకు సత్ఫలితాలు ఇవ్వలేదు. 

 


 

చేతులెత్తేసిన భారత బ్యాటర్లు

161 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. 11 పరుగుల వద్ద మొదలైన భారత వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది. 55 పరుగులకే భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతీ మంధాన 12, షెఫాలీ వర్మ 2, హర్మన్‌ప్రీత్ కౌర్ 15, జెమీమా రోడ్రిగ్స్‌ 13, రిచా ఘోష్‌ 12, దీప్తి శర్మ 13 పరుగులు చేశారు. ఒక్క టీమిండియా బ్యాటర్‌ కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్‌ బౌలర్లలో రోజ్మేరీ మెయిర్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించింది. న్యూజిలాండ్ పేస్ దాడిని భారత బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. దీంతో టీమిండియా 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక భారత్ ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది.