భగవద్గీత..అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. భగవద్గీతను పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది కేవలం మతగ్రంధం కాదు.. జీవిత సత్యాన్ని బోధించే వ్యక్తిత్వ వికాసం 


ఎవరైనా చనిపోతేనే భగవద్గీత వినాలా!


సాధారణంగా భగవద్గీత శ్లోకాలు వినిపించగానే అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారనే వారి సంఖ్య ఎక్కువే. అంటే..ఎవరైనా చనిపోయినప్పుడు వినే గ్రంధం మాత్రమేనా ఇది. 


Also Read: కృష్ణుడికి ఫస్ట్ లవ్ లెటర్ రాసినదెవరో తెలుసా - సృష్టిలోనే మొదటి ప్రేమలేఖ అదే!


భగవద్గీత చదవడం అంటే వైరాగ్యమా!


భగవద్గీత వింటున్నాం అని ఎవరైనా చెప్పినప్పుడు ఎందుకంత వైరాగ్యం అంటారు. కానీ భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను  సూచించే ప్రేరకం. 


జీవిత చరమాంకంలో చదివితే కాలక్షేపమా!


భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు...రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత వాటినుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంధం. జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది. ఎదురయ్యే ప్రతిప్రశ్నకీ సమాధానం ఇస్తుంది.  సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.


Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!


భగవద్గీత ఒక్కటీ చదివితే చాలు


మహాభారతంలో  భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. ఆరు యోగాలని కలిపి ఒక షట్కమంటారు. 1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కమని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు. మహా భారతంలో భగవద్గీత ఒక భాగమైనా, భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీతా సారాంశం


యుద్ధ వ్యూహాలు చెప్పలేదు - ఆలోచన సరిచేశాడు


శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’
అంటే...ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే బోధ ప్రారంభించాడు. 


Also Read: కృష్ణుడికి 8 మంది భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా!


అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించాడు


గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాలు నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. కేవలం అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించి రణరంగంలోకి దిగేలా బోధించాడు. ‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’. ‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడికి బోధించాడు.


చెప్పడం వరకే..ఆచరించాలో వద్దో నిర్ణయించుకోవాల్సి మీరే!


చెప్పడం వరకే శ్రీ కృష్ణుడి పని. చెప్పింది శ్రద్ధగా విన్నాడు..విన్నది అర్థం చేసుకున్నాడు..అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్నినిర్వర్తించి విజయం సాధించాడు అర్జునుడు.  


ఓవరాల్ గా చెప్పాలంటే భగవద్గీత ఓ మతానికి సంబంధించిన గ్రంధం ఎంతమాత్రమూ కాదు. మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్పించే వ్యక్తిత్వ వికాసం.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.