Krishna Janmashtami 2023 :  శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు వీళ్లే 
1. రుక్మిణి 2. సత్యభామ 3. జాంబవతి 4. కాళింది 5, మిత్రవింద 6.సుదంత 7.భద్ర 8. లక్ష్మణ


రుక్మిణి 


విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ కృష్ణుడినే కోరుకుంది. ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. శిశుపాలుడు, జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు కావడంతో రుక్మిణి ఇష్టాన్ని వ్యతిరేకించాడు సోదరుడు రుక్మి. సోదరిని శిశుపాలుకిడి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో రుక్మిణి శ్రీ కృష్ణుడికి సందేశం పంపిస్తుంది. అప్పుడు సోదరుడు బలరాముడితో కలసి విదర్భకు చేరుకుని రుక్మిణిని ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు శ్రీ కృష్ణుడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం.


Also Read: 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది - మన దేశానికి అసలు పేరు ఏంటి!


జాంబవతి


వినాయకచవితి కథల్లో భాగంగా సత్రాజిత్తు-శమంతకమణి గురించి చదువుకునే ఉంటారు.  సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి శమంతకమణిని తీసుకెళ్లి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి వెళ్లి జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీ మహావిష్ణువుగా గుర్తించిన జాంబవంతుడు మణితో పాటూ తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు


సత్యభామ


శమంతకమణిని తీసుకొచ్చి తిరిగి సత్రాజిత్తుకు అప్పగించడంతో తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బంధీగా ఉన్న ఆమెను విడిపిస్తాడు. పెళ్లిచేసుకోమని కోరిన చంద్రకాంతకు ఈ జన్మకు ఏకపత్నీవ్రతుడిని, వచ్చే జన్మలో పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తాడు. ఆమె ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది. పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అంశంగా చెబుతారు. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం. 


Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!


మిత్రవింద


కృష్ణుడి ఎనిమిది మంది భార్యలో మిత్రవింద ఒకరు.  కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి. పృథని శూరసేనుని బంధువు కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి  అంటారు. వీరిలో రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు. చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది. 


భద్ర


మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె భద్ర. శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలో మిత్రవింద, భద్ర మేనత్త పిల్లలు.


సుదంత


కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె సుదంత. రాజ్యంలో ఏడు ఎద్దులు అల్లకల్లోలం సృష్టిస్తాయి. వీటిని ఎవ్వరూ బంధించలేకపోతారు. వీటిని అదుపుచేసిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు నగ్నజిత్తు. ఆ ప్రకటన తర్వాత కృష్ణుడు ఆ ఎద్దులను వధించడంతో సుదంతను ఇచ్చి వివాహం చేశాడు నగ్నజిత్తు. 


కాళింది


కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే కృష్ణుడిని చూసి మనసు పడింది కాళింది. అది గమనించిన అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆవిడ మనోగతాన్ని కృష్ణుడికి చెప్పి పెళ్లిచేసుకునేలా చేశాడు. 


Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!


లక్షణ


మద్రదేశ రాకుమారి, బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. నారదుడి ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం గురించి విని తననే పెళ్లిచేసుకుంటాని పట్టుబట్టింది. ఈ సందర్భంగా తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో  కృష్ణుడిని మనువాడింది. 


వివిధ సందర్భాల్లో వీరిని పెళ్లిచేసుకోవాల్సింది వచ్చింది కానీ..శ్రీకృష్ణుడికి ఇష్టమైన భార్య మాత్రం రుక్మిణినే అంటారు. ఎందుకంటే ఆమె సాక్షాత్తూ శ్రీ మహాలక్షి అవతారం...


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.