ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజితా మా గృధ: కస్య స్విద్ ధనం


ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటీ మానవాతీత శక్తి లేదా  భగవంతుని నియంత్రణలో ఉంటుంది.  అందులో మనకి అవసరమైనవే మనం గ్రహించి తక్కినవాటిని వదిలివేయాలని పై శ్లోకానికి అర్థం.  అంటే ఈ జగత్తులో సర్వం ఈశ్వరుడితోనే నిండి ఉందని ఉపనిషత్‌ వాక్యానికి అర్థం.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా.. అంటే  సమస్త ప్రపంచం ఈశ్వరమయం అనే కదా. అంటే పుట్టుక నుంచి మరణానంతరం చేరుకునే శ్మశానం వరకూ మన ప్రతి చర్యలోనూ, నేర్చుకునే ప్రతి విద్యలోనూ శివుడున్నాడు...


Also Read: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి!



  • సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14  సూత్రాలు ఢమరుక నాదం నుంచి సృష్టించాడు శివుడు

  • వర్ణ సమ న్యాయం అందించిన శివుడికి కృతజ్ఞతగా అక్షరాభ్యాసం రోజు  ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’అని మొదటగా రాయిస్తారు.

  • యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించింది శివుడే. అందుకే ఆయనను ఆదిగురువు అంటారు.

  • స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి కూడా శివుడే

  • సంగీత విద్యకు మూలం సప్తస్వరాలు. అందులోని షడ్జమం(నెమలి) ,రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం) ,పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు), ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు.

  • ‘శివ తాండవం’ ద్వారా ‘నృత్యవిద్య’ను అందించాడు

  • దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు. పార్వతికి సగభాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో చెప్పాడు

  • సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించిన పరమేశ్వరుడు ‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశతు’ స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించమని  ప్రబోధించాడు.

  • శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు. గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు.

  • లింగంపై ఎన్ని అభిషేకాలు చేసినా ఏవీ నిలబడకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు. నిర్గుణతత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురుస్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.


సృష్టికి ఇన్ని అందించిన శివుడిని మించిన ఆవిష్కర్త ఎవరంటారు పండితులు


Also Read: పూరీలో విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ సగం చెక్కి ఎందుకు వదిలేశాడు!


నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రియంబకాయ, త్రిపురాంతకాయ,,,, త్రికాజ్ఞి కాలాయ, కాలాజ్ఞి రుద్రాయ, నీల కంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ శ్రీమన్మహాదేవాయ నమహ శ్రీమన్మహాదేవాయ నమో నమః


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.