Raksha Bandhan 2024 : శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగల్లో  రక్షా బంధన్ ఒకటి. సోదరుడు - సోదరి బంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. యుగయుగాలుగా ఆచరిస్తున్న ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకం. ఆ రోజు తమ సోదరుల చేతికి రాఖీ కట్టాల్సిందే అని సోదరీమణులు భావిస్తే..ఎంతదూరం అయినా వెళ్లి సోదరితో రాఖీ కట్టించుకోవాలని సోదరుడు అనుకుంటారు. వెళ్లే అవకాశం లేనివారు రాఖీని పంపించే ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంత ఘనమైన ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో అస్సలు జరుపుకోరు. మరికొందరు సోదరులకు కాకుండా కర్రలకు రాఖీలు కడుతుంటారు...వీని వెనుక ప్రచారంలో ఉన్న కథలెన్నో...


Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!
 
రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే!


ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా  బైనిపూర్ చాక్ లో రక్షాబంధన్ వేడుక అస్సలు జరుపుకోరు. ఎప్పుడూ జరుపుకోలేదా..కొత్తగా మానేశారా అంటే.. మూడు దశాబ్ధాల క్రితం రాఖీపండుగ జరుపుకున్నారట కానీ ఆ తర్వాత వద్దుబాబోయ్ అని వదిలేశారట. దీనివెనుక ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే.. ఆ  గ్రామంలో ఉండే ఓ జమిందార్ కి కుమారులున్నారు...ఓ రాఖీ పండుగ రోజు ఓ పేదింటి అమ్మాయిలను తీసుకొచ్చి రాఖీ కట్టించుకున్న జమిందార్ పిల్లలు ఏం కావాలో కోరుకోమన్నారట. వాళ్లు ఏకంగా..ఆస్తి కావాలని అడిగారట. మాటతప్పని జమిందార్ ఆస్తి మొత్తం రాసిచ్చేసి రోడ్డున పడ్డాడు....ఆ తర్వాత పూర్తిగా ఆ ఊరికే దూరమైపోయారట. అప్పటి నుంచి రాఖీ కట్టించుకునే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేశారట బైనిపూర్ గ్రామస్తులు..
 
ప్రాణాలు తీసిన రక్షా బంధన్  


ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా గున్నార్ లోనూ ఈ వేడుక జరుపుకోరు. రెండు దశాబ్ధాల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది..ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ యువకుడు చనిపోయాడు. రాఖీ వల్లే ఇదంతా జరిగిందనే భావనలో..అప్పటి నుంచి ఈ వేడుక జరుపుకోవడం మానేశారు.  ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేసిన కొందరు ఆ తర్వాత కూడా రాఖీ పండుగ జరుపుకున్నారట. అప్పుడు కూడా వివిధ రకాల ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడ్డారు. అందుకే ఆ గ్రామంలో రాఖీ పండుగ అంటే శాపంగా భావిస్తారు. గున్నార్ మాత్రమే కాదు..గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వా అనే గ్రామం సహా యూపీలో చాలా గ్రామాల్లో రక్షాబంధన్ ఉండదు.. 


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


కర్రలకు రాఖీ 


యూపీలో హార్పూర్ జిల్లా లో దాదాపు 60 గ్రామాల ప్రజలు కర్రలకు రాఖీలు కడతారు.  17వ తరానికి చెందిన రాజు మహారాణా ప్రతాప్ కాలంలో ఈ సంప్రదాయం పాటించేవారట..అందుకే గ్రామస్తులు అదే అనుసరిస్తున్నారు. అప్పట్లో యుద్ధంలో పాల్గొనే సైనికులకు రాఖీ కట్టేవారట.. కానీ ఆ తర్వాత వారి ఆయుధాలకు రక్ష కట్టడం ప్రారంభించారట. అందికే సైనకులకు గుర్తుగా కర్రలకు రాఖీ కడుతుంటారు ఈ గ్రామస్తులు. 


రక్షా బంధన్ వీరికి శాపం


యూపీ మీరట్ లో సురానా అనే గ్రామంలో కూడా రాఖీ పండుగ జరుపుకోరు.  12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజునే మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై  దండెత్తి అందర్నీ చంపేశాడు. కేవలం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మాత్రమే బతికారు. ఆ రోజు వాళ్ల చేతికి రాఖీ లేదు.. ఆ తర్వాత రాఖీ పండుగకు ఆ ఇద్దరు పిల్లలో ఒకరు రాఖీ కట్టించుకుంటే..ఆ తర్వాత దివ్యాంగుడు అయిపోయాడట. అప్పటి నుంచి రాఖీ తమకు కలసిరాదు అనేది గ్రామస్తుల నమ్మకం. అందుకే అక్క రక్షాబంధన్ వేడుక జరుపుకోరు.  


గమనిక:  సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.