Maha Shivratri 2023: సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు. పరమేశ్వరుడే ఆకాశం, భూమి, అగ్ని, జలం, వాయువు. ఇవే రూపాలతో ఐదు క్షేత్రాల్లో వెలిశాడు శంకరుడు. వాటినే 


ఆకాశలింగం-చిదంబరం
పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామివారికి ఇక్కడ పూజలందిస్తారు. చిదంబరంలో పరమేశ్వరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతం అంటారు...అందుకే ఇక్కడ నటరాజ విగ్రహం కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడివైపు చిన్న ద్వారం ఉంటుంది. అక్కడున్న గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది.


Also Read: ఆటగదరా శివా - జీవిత చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరించే శివుడి పాటలు మీకోసం


పృథ్వి లింగం-కంచి
తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరఆలయంలో పృథ్వి లింగం కొలువైంది. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఓసారి గంగమ్మ.. శివయ్యను ముంచెత్తే ప్రయత్నం చేసిందట..అప్పుడు పార్వతీమాత ఆ లింగాన్ని హత్తుకుని కాపాడిందనీ..అందుకు నిదర్శనంగా అమ్మవారి మెడలో ఉండే ఆభరణాల గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. స్వామి మామిడి చెట్టు కింద వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు.


వాయులింగం- శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశం ఉండదు...ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే. కానీ శ్రీకాళహస్తిలో స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దీనితో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు.


జలలింగం- జంబుకేశ్వరం
తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు నిదర్శనంగా  ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. భక్తులకు ఈ విషయం ప్రత్యక్షంగా చూపించేందుకు పానపట్టంపై వస్త్రం కప్పుతారు..కొద్దిసేపటి తర్వాత ఆ వస్త్రం తీసి నీటిని పిండి మళ్లీ వేస్తుంటారు. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం  అని పేరొచ్చింది. 


Also Read: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!


అగ్నిలింగం-అరుణాచలం
కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం . ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.