Kanuma 2024: కనుమ రోజు ప్రయాణం చేయొచ్చా...
పొలిమేర దాటొచ్చా..
కనుమ రోజు ప్రయాణం చేయకూడదని ఎందుకంటారు
కనుమరోజు ప్రయాణం చేస్తే ఏమవుతుంది...
సంక్రాంతి అంటేనే రైతుల కళ్లలో ఆనందాన్ని నింపేపండుగ..ధాన్య లక్ష్మిని నట్టింట్లోకి తీసుకొచ్చే పండుగ. ఆ ఆనందానికి, సిరిసంపదలకు కారణమైన పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజించే రోజే కనుమ. అందుకే కనుమను పశువుల పండుగ అంటారు. ఈ రోజున పాడి పంటలకు సహకరించే పశువులను అలంకరించి, మంచి ఆహారం అందించి పూజిస్తారు. పక్షుల కోసం కూడా వరికంకులు ఇంటి చూరు దగ్గర వేలాడిదీస్తారు. కనుమ రోజు పెద్దలను తలుచుకుంటూ మంసాహారం తింటారు. మాంసాహారం తినని వారికోసం అవే పోషకాలు అందించే మినుము తినాలని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు ఉపయోగపడతాయి. భోజనం సంగతి పక్కనపెడితే..కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు.. ఎందుకు..


Also Read: కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు కొటేషన్స్!


కనుమ రోజు ప్రయాణం చేస్తే...


కనుమ రోజు పెద్దలకోసం విందుభోజనాలు తయారు చేయడమే కాదు..కుటుంబం మొత్తం కలసి భోజనం చేయాలని చెబుతారు. పొద్దున్నే పశువులను పూజించడం, మధ్యాహ్నం పితృదేవతలకు తర్పణాలు వదలడం చేస్తారు. కొన్ని ఊర్లలో కనుమ రోజు గ్రామదేవతల ఆలయాల వద్ద బలులు ఇవ్వడం, పొంగళ్లు వండడం చేస్తారు. మూడు రోజుల పండుగలో మూడో రోజు కూడా చాలా ముఖ్యం. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అని అనేవారు పెద్దలు. కాదుకూడదని  ఆ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఏడాదిలో మూడు రోజుల పాటూ సంబరంగా జరుపుకునే ఈ పండుగ రోజు అంతా కలసి ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పారు కానీ ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందనే భావన అవసరం లేదంటారు మరికొందరు.


Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!


ముక్కనుమ రోజు ప్రయాణం చేయొచ్చా!


ముక్కనుము రోజు కూడా ప్రయాణం చేయకూడదంటారు మరికొందకు. వాస్తవానికి ముక్కనుమ అనేది మధ్యలో మొదలైన సంప్రదాయం. సంక్రాంతి ముందు రోజు భోగిని కీడుపండుగగా భావిస్తారు. ఈరోజు భోగిమంటలు వేయడం, భోగిపళ్లు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు...వీటి ద్వారా జీవితంలో ఉన్న చెడు అంతా పోయి భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. సంక్రాంతి రెండో రోజుని మార్పుకి సూచనగా భావిస్తారు. చేతికి అందిన పంటలతో పిండివంటలు చేసుకుని దేవతలకు కృతజ్ఞత చెబుతారు. పితృదేవతలని కూడా తల్చుకుంటారు. అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది. ఇక సంక్రాంతి మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ లేదు..కానీ..కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజున గ్రామదేవతలకు బలిచ్చి మాంసాహారం వండుకుని తినే సంప్రదాయం ఉంది. ఈ రోజున ప్రయాణాలు చేయకూడదు అనే నిమమాలేమీ లేవు.


పురాణాల ప్రకారం, పుష్య మాసంలో కృష్ణపక్షంలో వచ్చే కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజున దేవతలందరూ మన ఇంటికి వస్తారని.. అందుకే కనుమ, ముక్కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతారు. కనుమ రోజున ప్రయాణం చేయడం వల్ల ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని.. అందుకే మూడు రోజుల పాటు ముచ్చటగా పండుగను జరుపుకుని.. ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించాలని పెద్దలు చెబుతారు. 


నోట్: కొందరు పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది..దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం