Eruvaka Pournami 2023: వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం. 


జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక ఎందుకు!


సస్యానికి అధిపతి చంద్రుడు  ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.


Also Read: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!


పంటపొలం దైవక్షేత్రం!


పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.


Also Read: ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం


ఏరువాకకి ఎన్ని పేర్లో!
ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి  మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా  వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. 
'వప్ప మంగళ దివసం'
'బీజవాపన మంగళ దివసం'
'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'
'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' 
అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 


కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.