Bhagavad Gita: ప్రాచీన హిందూ మత గ్రంథమైన భగవద్గీత ఒక అద్భుతమైన కథను చెబుతుంది. శ్రీకృష్ణుడు తన మిత్రుడైన అర్జునుడికి క‌ర్త‌వ్య బోధ చేసి, కార్యోన్ముఖుడిని చేసే సన్నివేశం అది. యుద్ధభూమిలో నేను నా సొంత బంధువులతో పోరాడాలా అని అర్జునుడు యుద్ధం నుంచి వైదొలగాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు కర్తవ్యం, చర్య, పరిత్యాగం గురించి బోధిస్తాడు. శారీరకంగా దృఢంగా ఉన్న అర్జునుడిని యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు మానసికంగా ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి మానసిక జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు..? మహాభారత యుద్ధ విజయానికి అది ఎలా దోహదపడిందో చూద్దాం.


1. స్వధర్మమే పాటించండి
గీత మనకు మన సొంత మార్గాలను అనుసరించవలసిన కర్తవ్యాన్ని బోధిస్తుంది. మీ మాన‌సిక‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు మీ స్వభావాన్ని కనుగొని తదనుగుణంగా ప్రవర్తించాలని భగవద్గీత చెబుతుంది. ఇది హిందూ ధ‌ర్మానికి సంబంధించినది. ప్రతి ఒక్కరికి వారి సొంత విధి, ధ‌ర్మం ఉన్నాయి. మనం అనుస‌రించాల్సిన‌ నిజమైన కర్తవ్యాన్ని గ్రహించి ధర్మ మార్గం ద్వారా నెరవేర్చాలని శ్రీకృష్ణుడు గీత‌లో చెప్పాడు. మనం ఎల్లప్పుడూ మన సహజ స్వభావాలను కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. నీ స్వభావాన్ని కనుగొని దాని ప్రకారం నడుచుకో అని శ్రీకృష్ణుడు సూచించాడు.


Also Read : గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది


2. ఫ‌లితాన్ని ఎప్పుడూ ఆశించవద్దు
మీరు ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే వెయ్యి సార్లు చదివారు. అయినా ఇది అనంతంగా ఎదుర‌వుతూనే ఉంటుంది. శ్రమ ఫలాలపై వ్యామోహాన్ని విడిచిపెట్టి, అంచనాలు లేకుండా పని చేయాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మీకు లక్ష్యం లేకపోతే, మీరు చేసే ప‌నికి దిశ లేకపోతే మీరు మీ విధులను నిర్వర్తించలేరు. మీకు ఒక లక్ష్యం ఉంటే, దాని కోసం పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడంలో భావోద్వేగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్ర‌తిఫలం కోసం పని చేయకుండా ధ‌ర్మం ప్రకారం మీ పని చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం మీకు ద‌క్కుతుంది.


3. మీ జీవితాన్ని మితంగా ఉంచండి
జీవితంలో ఎక్స్ ట్రా అంటూ ఏమీ ఉండదు. ప్రతిదీ మితంగా ఉండాలి. మనం తినే దగ్గర్నుండి నిద్రపోయే వరకు అన్నీ మితంగానే చేయాలి. ఆహారంలో మీకు కావలసినంత తినండి. మీకు కావలసినంత నిద్రపోండి, మీకు కావలసినంత మాట్లాడండి. అతిగా తినడం, నిద్రపోవడం, మాట్లాడటం మీకు ఎప్పటికీ మేలు చేయవు. రాబ‌డి-ఖర్చు షెడ్యూల్‌ను రూపొందించండి, దాని ప్రకారం జీవించడం ప్రారంభించండి. జీవితంలో ప్రతిదీ మితంగా ఉపయోగించినప్పుడు జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.


4. ధ్యాన సాధన
శ్వాస కోసం కొంత సమయం కేటాయించాలని భగవద్గీత చెబుతోంది. దీని కోసం మీరు ధ్యానం చేయాలి. మీ కళ్లు మూసుకుని, నెమ్మదిగా మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా ధ్యానం చేయండి. ధ్యానం మీ మనస్సును తేలికపరుస్తుంది. మనస్సు అనవసర విషయాల గురించి చింతించటం మానేస్తుంది. ఆలోచనలు మెరుగవుతాయి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 4 సూత్రాలను పాటించడం ద్వారా మనం మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు.


Also Read : భగవద్గీతలోని ఈ వాక్యాలు ప్రేమకు, కర్మకు ప్రతిరూపం..!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.