Diwali 2024:  దీపావళికి ఇళ్లన్నీ దీపకాంతులతో వెలిగిపోతుంటాయి..అయితే ఏ పండుగకు కాకుండా దీపావళి రోజే దీపాలు ఎందుకు?  


భారతీయ సంస్కృతిలో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఆలయం అయినా, ఇల్లు అయినా ఏ శుభకార్యం అయినా ప్రారంభమయ్యేది దీపారాధనతోనే. అంత విశిష్టత ఉండే దీపాలతో ఇల్లంతా నింపేసే పండుగ దీపావళి. అమావాస్య చీకటి లాంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగుతో సమానమైన జ్ఞానాన్నిచ్చే దీపాలను వెలిగిస్తారు. అందుకే దీపాన్ని జ్ఞానజ్యోతి అని కూడా అంటారు. 


సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే॥


దీపం వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. ఆ సందేహాలకు సమాధానం ఈ శ్లోకం. సాజ్యం త్రివర్తి సంయుక్తం..అంటే మూడు ఒత్తులు కలిపి అని అర్థం. 3 ఒత్తులను నూనెలో తడిపి అగ్నితో వెలిగించిన శుభప్రదమైన, ముల్లోకాల్లో చీకట్లను పారద్రోలే దీపాన్ని వెలిగించాను. అలాంటి దీపాన్ని భక్తితో పరమాత్మకి  సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి నన్ను రక్షింటే..దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నా అని అర్థం.  


Also Read: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!


దీపావళి అంటే దీపాల వరుస
'అజ్ఙానం'అనే చీకటిని తొలగించే 'జ్ఙానం'
దీపాన్ని త్రిమూర్తి స్వరూపంగా చెబుతారు..
'ఎర్రని' కాంతి బ్రహ్మదేవుడు
'నీలి' కాంతి శ్రీమహావిష్ణువు
'తెల్లని' కాంతి పరమేశ్వరుడు
 
దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి స్వయంగా భూలోకానికి దిగివస్తుంది. అందుకే అమావాస్య చీకటిని తరిమేసేందుకు వరుస దీపాలతో అమ్మవారికి ఇంట్లోకి స్వాగతం పలుకుతారు.


దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే..


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!


దీపం వెలిగించేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి


దేవతా స్వరూపం అయిన దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రమిదకు గంధం , కుంకుమ బొట్టు, పూలు పెట్టి నమస్కరించాలి. అనంతరం అక్షతలు సమర్పించి పూజించాలి. 


దీపారాధనకు వెండి, ఇత్తడి కన్నా మట్టి ప్రమిదలే మంచివి. లోహం వేడెక్కితే భూమి వేడెక్కుతుంది, మట్టి ప్రమిదలు అయితే వేడిని గ్రహిస్తాయి..అందుకే మట్టి ప్రమిదనే వినియోగించండి  


ప్రమిదలో రెండు లేదా మూడు ఒత్తులు వేసి వాటిని కలిపి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి వినియోగించాలి.


ఇంద్రుడు దీపావళి రోజు లక్ష్మీ ఆరాధన చేసి పోయిన ఐశ్వర్యాన్ని తిరిగిపొందాడు.. అందుకే దీపాలు పెట్టిన ఇంట్లో దారిద్ర్యం ఉండదంటారు. 


దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే


జీవాత్మకి, పరమాత్మకి ప్రతీక దీపం..అందుకే పూజ చేసేముందు దీపం వెలిగించి... దేవుడికి ప్రతిరూపాన్ని ఆరాధిస్తాం. షోడసోపచారాల్లో మొదటి , ముఖ్యమైనది దీపం. అందుకే శుభకార్యాలు, వేడుకలు, పండుగల సమయంలోనే కాదు నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం ముఖ్యం అంటారు పండితులు..


Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!