Diwali 2024  Importance of Dakshinavarti Shankam :  ఆనందం,  ఐశ్వర్యానికి అధిదేవతగా  శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే జీవితంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు పండితులు. దీపావళి రోజు వినాయకుడిని, శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలో  ఏనుగులు, కొత్తిమీర విత్తనాలు, శ్రీచక్రం ఇలా చాలా వస్తువులు ఉంచుతారు. వీటన్నింటిలో ముఖ్యమైనది దక్షిణావర్తి శంఖం. దీపావళి సందర్భంగా ఈ శంఖం కొనుగోలు చేసి తీసుకొచ్చి పూజలో ఉంచి..అప్పటి నుంచి ప్రతిశుక్రవారం పూజించడం అత్యంత ప్రధానం... 


Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!


సముద్రం నుంచి లభించే శంఖానికి పురాణాల్లో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శ్రీకృష్ణుడు, అర్జునుడితో పాటు పాండవుల దగ్గరుండే శంఖాలకు పేర్లున్నాయి. శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం.. అర్జనుడి శంఖం దేవదత్తం.. భీముడి శంఖం పౌండ్రకం..ధర్మరాజు శంఖం అనంత విజయ, నకులుడు శంఖం సుఘోషనామం... సహదేవుడి శంఖం మణిపుష్ప . క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు శ్రీ మహాలక్ష్మితో పాటూ దక్షిణావర్తి శంఖం ఉద్భవించింది. అందుకే శ్రీ మహలక్ష్మితో పాటూ దీపావళి రోజు పూజలో ఈ శంఖాన్ని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయంటారు. ఈ దక్షిణావర్తి శంఖం ఇంట్లో ఉంటే ఆహారానికి కొదువ ఉండదు. 
 
అన్ని శంఖాల్లో దక్షిణావర్తి శంఖాన్ని ఎలా గుర్తించాలనే సందేహం రావొచ్చు.. సాధారణంగా సముద్రంలో కనిపించే శంఖాలన్నీ ఎడమ రెక్కలు ఉంటాయి.  అంటే ఉదరం ఎడమవైపు తెరిచి ఉంటుంది. కానీ దక్షిణావర్తి శంఖ ఉదరం కుడి వైపు ఉంటుంది.  


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!


దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే వీటిని ఇంట్లో ఉంచి నిత్యం పూజించాలంటే కొన్ని నియమాలున్నాయి. ఎరుపురంగు వస్త్రాన్ని పరిచి.. దక్షిణావర్తి శంఖంలో గంగాజలం నింపి దానిపై ఉంచాలి.  ఓ రోజంతా గంగాజలంతోనే ఉంచాలి.  ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించి.. మరుసటి రోజు గంగాజలాన్ని తీసేసి ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచాలి. ప్రతి శుక్రవారం పూజ చేయాలి.


ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తి శంఖం ఉంటే వారిపై శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. 


ఇంత మంచి విశిష్టత ఉన్న ఈ శంఖాన్ని ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా.. దీపావళి రోజే ఎందుకు అంటే...లక్ష్మీదేవితో పాటూ ఉద్భవించినది కావడంతో పాటూ ఈ రోజు చేసే లక్ష్మీపూజకు ఎంతో విశిష్టత ఉంది..అందుకే దీపావళి రోజు ఈ శంఖాన్ని పూజిస్తారు. దక్షిణావర్తి శంఖాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఐశ్వర్యానికి లోటుండదు. ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయాల్లో అర్చన సమయాల్లో శంఖనాదం చేయడం ఇప్పటికీ చూస్తుంటాం.


Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!