Diwali 2024 Dhanteras: ఆశ్వయుజ మాసంలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఆభరణాలతో అమ్మవారిని పూజించగలిగితే సరే.. లేదంటే  కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకుని లక్ష్మీపూజలో పెట్టుకోవచ్చు.   అక్టోబరు 30 వ తేదీ ధనత్రయోదశి వచ్చింది. యమదీపం వెలిగించాలి అనుకునేవారు అక్టోబరు 29 సాయంత్రం వెలిగించవచ్చు....
 
శ్రీ యంత్రం


ధన త్రయోదశి రోజు శ్రీ యంత్రం కొనుగోలు చేసి పూజ చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉంటుంది. హిందూ మతవిశ్వాసల ప్రకారం ధనత్రయోదశి రోజు శ్రీయంత్రాన్ని పూజించలేకపోతే దీపావళి రోజు సూర్యాస్తయమం సమయంలో పూజించినా మంచిదే. 


చీపురు


పరిశుభ్రతకు చిహ్నం చీపురు.. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే వీటిని కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు మంచి రోజులు చూస్తుంటారు. అయితే ఏడాదిలో ధనత్రయోదశి చీపుర్లు కొనుగోలుకి అత్యంత ముఖ్యమైన రోజు.  ఈ రోజు చీపురు కొనుగోలు చేసి తీసుకొస్తే దారిద్ర్యం తొలగిపోతుందని భావిస్తారు.


Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!


మట్టి దీపాలు


మట్టి దీపాల కొనుగోలు కూడా ఈ రోజే మొదలుపెడతారు. ధన త్రయోదశి రోజు మట్టిదీపాలు కొనుగోలు చేసుకుని తీసుకొస్తే ఇంట్లో సౌభాగ్యం, సంతోషం ఉంటుందని.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వశిస్తారు. 


ధనియాల విత్తనాలు 


 ధనియాల విత్తనాలు లేదా కొత్తిమీర విత్తనాలు.. ధన త్రయోదశి రోజు వీటి కొనుగోలు ఐశ్వర్యానికి సూచనగా పరిగణిస్తారు. లక్ష్మీపూజ చేసే సమయంలో ధనియాల విత్తనాలు కొనుగోలు చేసి పూజలో పెట్టిన తర్వాత వాటిని ఇంట్లో డబ్బుని భద్రపరిచే ప్రదేశంలో ఉంచితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్మకం. 


గోమతి చక్రం


గోమతి చక్రాల కొనుగోలును కూడా ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి సూచనగా భావిస్తారు. ఈ రోజు గోమతి చక్రాలు తీసుకొచ్చి పసుపు రంగు వస్త్రంలో ఉంచి అమ్మవారిదగ్గర పూజలో ఉంచాలి. ఆ తర్వాత వీటిని లాకర్లో భద్రపరిస్తే సంపద పెరుగుతుంది. 


అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని..అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. బంగారం, వెండి ఆభరణాలు కానీ లేదంటే పైన పేర్కొన్న వస్తువులు కానీ ఈ రోజు కొనుగోలు చేస్తారు. ఇదే రోజుకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఆరోగ్యానికి, ఔషధానికి అధిపతి అయిన ధన్వంతరి ఉద్భవించిన రోజు కూడా ఇదే. అందుకే ధనత్రయోదశి రోజు ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని, ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తారు.


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!


ధన్వంతరి గాయత్రీ 


ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి 
తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ 


ధన్వంతరి  తారకమంత్రం 


ఓం ధం ధన్వంతరయే నమః 


ధన్వంతరి మంత్రః 


ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే 
అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ 
త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప 
శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |


Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!