Chaturmasya Deeksha 2024 : ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి వరకూ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్య దీక్ష పాటిస్తారు. ఈ దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటూ ప్రయాణాలు చేయరు, కామ క్రోధాలకు దూరంగా ఉంటారు..ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటిస్తారు. అప్పట్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది ...ఇప్పుడు కేవలం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ నాలుగు నెలలపాటూ శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. విష్ణువు నిద్రించే ఈ సమయంలో నేలపైనే నిద్రించడం, ఆహార నియమాలు పాటించడం, నిరంతరం దైవారాధనలో గడపడం చేస్తారు. 4 నెలల పాటూ నిత్యం ఒక పూట భోజనం చేస్తూ..ఏకాదశి తిథుల సమయంలో ఉపవాస నియమాలు పాటిస్తారు. ఈ నాలుగు నెలలు క్షురకర్మలు కూడా చేయించుకోరు.  ఈ దీక్ష సమస్త పాపాలను తొలగిస్తుందని..సత్యం ధర్మాన్ని పాటిస్తూ అనేక సమస్యలపాలైన  హరిశ్చంద్రుడు ఈ వ్రతం ఆచరించడం వల్ల విజయం సాధించాడని చెబుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా పార్వతీ దేవి భూలోకానికి వెళ్లి ఓ భక్తురాలికి వివరించిందని చెబుతారు.


Also Read: 'కర్కిడకం' పూజ కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం - ఈ ఏడాది చివరి వరకూ అయ్యప్ప ఆలయం తెరిచి ఉండే తేదీలివే!
 
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః


చాతుర్మాస్య దీక్షను బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాస...నాలుగు ఆశ్రమాలు వారు పాటించవచ్చు. ఈ దీక్ష చేయడానికి కుల, వర్గ నియమాలు లేవు..లింగ వివక్ష లేదు. 


Also Read: అన్నవరం ఆలయం కింద అంతస్తులో ఏముంది - ఈ క్షేత్రం గురించి మీకు తెలియని విషయాలివే!


ఆరోగ్యానికి చాతుర్మాస్య దీక్ష


ఈ దీక్ష చేయడం వెనుక ఆధ్యాత్మిక కారణాల కన్నా ఆరోగ్య కారణాలు అధికం అని చెప్పుకోవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా.. ఈ నాలుగు నెలలు భూమ్మీద సూర్యకాంతి తగ్గుతుంది. పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది.  ఈ సమయంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తుంటాయి. అందుకే చాతుర్మాస్య దీక్ష పేరుతో నాలుగు నెలల పాటూ ఆహార నియమాలు పాటించడం, ఓ పూట భోజనం చేయడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఆహారనియమాల్లో భాగంగా...ఈ నాలుగు నెలల్లో  శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీకంలో పప్పు పదార్థాలను ఎక్కువగా భుజించకూడదు. ఈ నాలుగు నెలలు ఉసిరికాయలు ఎక్కువగా వినియోగించాలి. 


దీక్ష పాటించని వారి సంగతి సరేకానీ...చాతుర్మాస్య దీక్ష పాటించే వారు ఈ నాలుగు నెలలు తాము నివసించే గ్రామాన్ని దాటకూడదు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. ఈ నాలుగు నెలలు బ్రహ్మచర్యం, ఒకపూట భోజనం, నేలపై నిద్ర, అహింస, పురాణ పఠనం, యోగసాధన , దాన ధర్మాలు ఇవన్నీ అనుసరించడం శ్రేయస్కరం... 


Also Read: గురువాయూర్ కి ఆ పేరెలా వచ్చింది - ఇక్కడ బాలగోపాలుడి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా!


గమనిక: వివిధ శాస్త్రాలు,  పండితులు పేర్కొన్న ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ అందించాం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.