తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,  వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాలు పరస్పరం రాజీనామాల సవాళ్లు చేసుకున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఒకరికొకరు చాలెంజ్ చేసుకున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో టీడీపీ రైతు విభాగం ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో అచ్చెన్నాయుడు ప్రసంగించారు. ఏపీలో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని..ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 160 స్థానాలు వస్తాయని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. 


"న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చ" ఇప్పటికి లేనట్లే ! ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిందా ?


అచ్చెన్నాయుడు ప్రకటనపై నగరి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేరోజా స్పందించారు. విజయవాడలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అచ్చెన్నాయుడు ప్రకటన గురించి ప్రస్తావించారు. అచ్చెన్నాయుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో పార్టీ లేదని మాట్లాడారని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు  గట్టి చట్నీ గట్టిగా తింటే   160 కిలోలు పెరుగుతారేమోగానీ తెలుగుదేశం పార్టీకి  ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమన్నారు. అచ్చెన్నాయుడుకు  సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్‌  చేశారు. 


మహిళలకు 51 శాతం పదవులు ఒక్క ఏపీలోనే చట్టం - మహిళా దినోత్సవ వేడుకలో సీఎం జగన్


రోజా విమర్శలపై అచ్చెన్నాయుడు కూడా స్పందించారు.  చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారని .. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు..  సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారని విమర్శించారు.  


విద్యాదీవెన పథకం వాయిదా...11లక్షల మంది ఏపీ విద్యార్థుల తల్లిదండ్రులకు బ్యాడ్ న్యూస్ !


రాజకీయాల్లో రాజీనామాల సవాళ్లు మామూలే. అయితే ప్రతీసారి రాజకీయ నేతలు ఓ కండిషన్ పెట్టుకుంటారు.  దాన్ని ఎవరూ అధిగమించరు. దీంతో ఎవరూ రాజీనామాలు చేయరు. ఇప్పుడు అచ్చెన్నాయుడు,రోజా కూడా అలాంటి సవాళ్లే చేసుకుంటున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఎన్ని సవాళ్లు చేసుకున్నా ఎవరూ రాజీనామా చేయరని అంటున్నారు.