Viral Video: ఈ మధ్య కుక్కలు.. మనుషులపై దాడులు చేస్తోన్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ కుక్క ఆవుపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆవుకు తీవ్రంగా గాయమైంది.


యూపీలో


ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లో జరిగింది. పిట్‌ బుల్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. ఆవు దవడను తన నోటితో కుక్క బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది.


అయితే ఆవును రక్షించడానికి  కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్క.. ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి.  






వైరల్


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్క లైసెన్స్‌ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. ఆవుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. 


ఉత్తర్‌ప్రదేశ్, కేరళలో ఇటీవల వరుసగా కొన్ని చోట్ల కుక్కలు పలువురిపై దాడి చేశాయి. వీధి కుక్కలే కాదు. పెంపుడు కుక్కలు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలోని లిఫ్ట్‌లో ఓ చిన్నారిపై కుక్క దాడి చేసిన విజువల్ ఇప్పటికే వైరల్ అయింది. తరవాత ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పైనా ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే ఇప్పుడు ఓ చర్చ తెరపైకి వచ్చింది. Pitbuls జాతి కుక్కలతోనే ఈ ప్రమాదం పొంచి ఉందని, వాటిని పెంచుకోకుండా బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీధి కుక్కలు కూడా ఇలా దాడి చేసిన ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. కేరళలో ఓ ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కల గుంపు పరుగులు పెట్టించిన వీడియో కూడా వైరల్ అయింది.


Also Read: Maharashtra Political News: సీఎం సీట్లో ముఖ్యమంత్రి కుమారుడు- వైరల్ అయిన ఫొటోలు, విపక్షాల సెటైర్లు!


Also Read: Yediyurappa Graft Case: మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ రిలీఫ్- ఆ కేసు విచారణపై సుప్రీం స్టే!