Arunachal  Integral Part India: 


ఎన్నో ఏళ్లుగా వివాదం..


అరుణాచల్‌ ప్రదేశ్ విషయమై చైనా ఎన్నో ఏళ్లుగా భారత్‌తో తగువులాడుతోంది. అరుణాచల్‌ తమ దేశంలో భాగమే అంటూ వాదిస్తోంది. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాలా సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్‌ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. 


"ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా చూస్తోంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మైత్రి ఉన్న దేశాలతో అమెరికా మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. ముఖ్యంగా భారత్‌కు తప్పకుండా అండగా ఉంటాం" 


- సెనేటర్ 


అంతే కాదు. ఇదే తీర్మానంలో అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాన్ని భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పింది అమెరికా. ఎల్‌ఏసీ విషయంలో భారత్‌తో జరిగిన ఒప్పందాలను చైనా ఖాతరు చేయకపోవడంపై మండి పడింది. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని వెల్లడించింది. దాదాపు ఆరేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. గల్వాన్ ఘటనతో అది రుజువైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను PRCలో భాగమే అన్న చైనా వాదనను అమెరికా చాలా తీవ్రంగా ఖండిస్తోంది. 


గతేడాది డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.  మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ ఘర్షణ జరిగిన కొద్ది రోజుల తర్వాత.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థిరమైన, బలమైన సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్‌తో కలిసి పని చేయడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

" చైనా, భారత్.. దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. చైనా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.                                       "