Russia Ukraine War:



డ్రోన్‌ గల్లంతు..


రష్యాకు చెందిన సుఖోయ్ -27 ఫైటర్ జెట్‌ అమెరికన్ డ్రోన్‌ను ఢీకొట్టింది. బ్లాక్‌ సీ గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమెరికన్ MQ-9 Reaper డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై అమెరికా మిలిటరీ తీవ్రంగా స్పందించింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ మండి పడుతోంది. ఢీకొట్టే ముందు డ్రోన్‌పై పదేపదే ఫ్యూయెల్‌ చల్లిందని, కావాలనే ఆ డ్రోన్‌కు ఎదురుగా వచ్చి ఢీకొట్టారని ఆరోపిస్తోంది. అటు రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను కొట్టి పారేస్తోంది. కావాలని చేసింది కాదని వెల్లడించింది. నిఘా ఆపరేషన్‌లో భాగమే ఫైటర్ జెట్‌ను పంపినట్టు తెలిపింది. "అమెరికాకు చెందిన మానవ రహిత డ్రోన్ ఉన్నట్టుండి అదుపు తప్పింది. మా ఫైటర్‌ జెట్‌ను ఢీకొట్టి నీళ్లలో పడిపోయింది" అని వివరిస్తోంది. కానీ అగ్రరాజ్యం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. అత్యవసరంగా సమావేశమవ్వాలని రష్యన్ అంబాసిడర్ అనటోలి అంటోనోవ్‌కు కబురు పంపింది. ఈ విషయమై రెండు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా జాగ్రత్త పడతామని అంటోనోవ్ చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా డ్రోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాకు చెందిన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోసారి ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 


ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలని రష్యా ప్రయత్నాలు చేయడంపై గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రష్యా చేసే తీవ్రమైన తప్పుగా అమెరికా భావిస్తుందని బైడెన్ అన్నారు. యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ వద్ద రష్యా తన అణు సామర్థ్యాలపై సాధారణ కసరత్తులను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీనిపై బైడెన్ ఘాటుగా స్పందించారు.


" రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే అది చాలా తీవ్రమైన తప్పు అవుతుంది. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందా లేదా అనే దానిపై నేను ఏమీ చెప్పలేను. కానీ ఒక వేళ వినియోగిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుంది.                     "




-   జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు






వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.


" అధ్యక్షుడు తాను చెప్పినదానిపై స్పష్టంగా ఉన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడం పెద్ద తప్పు, ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఉక్రెయిన్ తన సొంత భూభాగంలో డర్టీ బాంబును ఉపయోగించేందుకు సిద్ధమవుతోందనేది రష్యా చేస్తోన్న తప్పుడు ఆరోపణ. కాబట్టి మేము దీనిని తీవ్రంగా పరిగణించాలి.                                       "




-కరీన్ జీన్-పియర్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ 


ఉక్రెయిన్ విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేస్తోంది. కీవ్‌, జటోమీర్‌, దినిప్రో, జపోరిజియాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తోంది. జటోమీర్‌లో 2 లక్షల యాభై వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కీవ్‌లోనూ 50వేల మంది అంధకారంలో నలిగిపోతున్నారు.విద్యుత్‌ సరఫరా లేని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కనీస వసతులకు నీరు లేక ఉక్రెయిన్‌ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 


Also Read: Land For Jobs Scam: ఢిల్లీ కోర్టుకి లాలూ కుటుంబం, ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ కేసు విచారణ