అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 20 ఆవులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతని డెయిరీ బ్రాండ్ వాల్యూ రూ. 44 కోట్లు. నమ్మశక్యంగా లేదు కదా! కిషోర్ ఇందుకూరి సక్సెస్ స్టోరీ చదువుతుంటే, ఏదో తెలియని స్ఫూర్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదేంటో మీరూ చదవండి!


ఒక సున్నితమైన అంశం డెయిరీకి దారితీసింది:


సిద్స్ డెయిరీ! హైదరాబాదులో ఇదొక ప్రఖ్యాత మిల్క్ బ్రాండ్! ఈ పేరు ఓవర్ నైట్ రాలేదు! కిషోర్ ఇందుకూరి తన లైఫ్ రిస్క్ చేశాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసుకున్నాడు. గ్రీన్ కార్డ్ కాదనుకున్నాడు! ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఇండియా వదిలి అమెరికా దాకా వెళ్లాడూ అంటే, మళ్లీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యేది కలే! అలాంటి కలల సామ్రాజ్యాన్ని వదిలేసి పుట్టినగడ్డ మీద అడుగుపెట్టాడు. ఒక సున్నితమైన అంశం ఈ కఠిన నిర్ణయానికి కారణమైంది. అదే సక్సెస్‌కు ఆలంబనగా నిలిచింది.


 


ఆత్మలేని అమెరికాలో ఎన్నికోట్లు సంపాదించినా:


ఎంత బిజీగా ఉన్నా ప్రతీ సంవత్సరం హైదరాబాద్ రావడం కిశోర్‌కు ఇష్టం. వచ్చినప్పుడ్లలా స్నేహితుల ఫామ్ హౌజుల్లో విహరించడం, నేచర్‌తో కలిసిపోవడం.. ఇదే ఇష్టం. ఆత్మలేని అమెరికాలో ఎన్నికోట్లు సంపాదించినా ఏదో పోగొట్టుకున్న భావన వెంటాడేది! అమ్మలాంటి ఈ నేలమీద, తల్లిలాంటి ఈ మట్టిమీద ఎందుకు గౌరవంగా బతకలేం అని పదేపదే అనుకున్నాడు.


 


ఒకసారి ఏం జరిగిందంటే..


హైదరాబాద్‌లో పాల విషయంలో జనంలో  ఎంత కన్ ఫ్యూజన్ ఉందో కిశోర్ గ్రహించాడు. ఒక్క హైదరాబాద్ ప్రజలకే కాదు, ఎంటైర్ వ్యవస్థలోనే తాగే పాలపై ఒక అపనమ్మకం! క్రెడిబిలిటీ తక్కువ! కళ్లుమూసుకుని తాగాల్సిందే! లేకుంటే బతకలేం! ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనుకున్నాడు. అలా సొంత డెయిరీ పెట్టడానికి అడుగులు పడ్డాయి. నెలల తరబడి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించాడు. అలా సాఫ్ట్ వేర్ నుంచి క్రమంగా వ్యవసాయంపై మనసు మళ్లింది.


 


గడప ముందుకే తాజా పాలు అనే కాన్సెప్టుతో:


2012లో కోయంబత్తూరు నుంచి 20 ఆవులను కొనుగోలు చేసి హైదరాబాదులో డెయిరీ ఫాం ఏర్పాటు చేశాడు.  మొదట రూ. కోటి పెట్టుబడి. తన కొడుకు సిద్ధార్థ్ పేరుతో సిద్స్‌ ఫామ్ అని నామకరణం చేశాడు. మీ గడప ముందుకే తాజా పాలు అనే కాన్సెప్టుతో మార్కెట్లోకి ప్రవేశించాడు. తెలిసిన డాక్టర్ సహకారంతో పశువుల పెంపకంలో మెళకువలు తెలుసుకున్నాడు. కూడబెట్టుకున్న ప్రతీ పైసానూ పాడిమీదనే పెట్టాడు.  


 


తెల్లవారుజామున 2.30 గంటలకే ప్యాకెట్లు రెడీ:


యేడాది రీసెర్చ్! అప్పటికే మార్కెట్లో పాల పోటీదారులు చాలామంది ఉన్నారు. రకరకాల మిల్క్ ప్రాడక్ట్స్ కాంపిటిషన్‌లో ఉన్నాయి. ఈ పోటీని దృష్టిలో ఉంచుకొని తన ఎజెండా ఫిక్స్ చేసుకున్నాడు. పొద్దున్నే 6.30 గంటలకే క్లయింట్ గుమ్మంముందుకు పాలు చేరేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందుకోసం తెల్లవారు జామున 4 గంటలకు ప్యాకింగ్. కస్టమర్లు క్రమంగా పెరిగారు. ప్యాకింగ్ టైం సరిపోక, మార్పులు చేశారు. తెల్లవారుజామున 2.30 గంటలకే ప్యాకెట్లు రెడీ చేస్తున్నారు.


 


13 ఏళ్ల ప్రయాణం తర్వాత 40 కోట్ల రెవెన్యూ:


సిద్స్ ఫార్మ్! 2012లో ప్రయాణం స్టార్టయింది. 2016లో డెయిరీ రిజిస్టర్ అయింది. 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 10,000 మంది కస్టమర్లకు పాలను సరఫరా చేస్తున్నారు. 13 ఏళ్ల ప్రయాణం! ఏదీ కేక్వాక్ కాదంటాడు కిశోర్. వెంచర్ ప్రారంభించినప్పుడు తొలి పెట్టుబడి దాదాపు రూ. 1 కోటి. ఆ తర్వాత రూ. 2 కోట్లు. బ్యాంకుల నుంచి మరో రూ.1.3 కోట్ల టర్మ్ లోన్ తీసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో డెయిరీ ఫాం. బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, ఇన్‌స్టంట్ మిల్క్ చిల్లింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. 


 


లోకల్, నేషనల్ పోటీ మధ్య సిద్స్‌ బ్రాండ్ దూకుడు


పాలే కాకుండా పెరుగు, పనీర్, బటర్ లాంటి మిల్క్ ప్రాడక్టులు కూడా యాడ్ చేశారు.  ముఖ్యంగా హైదరాబాదులో సిద్స్ డెయిరీ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉంది. నేషనల్ బ్రాండ్లతో పాటు కంట్రీ డిలైట్, అక్షయకల్ప, హెరిటేజ్, జెర్సీ వాటితో సిద్స్ పోటీ పడుతోంది. పాలలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, యాంటీ బయాటిక్స్, హార్మోన్లను కలపబోమని సిద్స్ ఎండీ కిశోర్ చెబుతున్నారు.


 


కోవిడ్‌ టైంలో ఎదుర్కొన్న కష్టం అంతాఇంతా కాదు: కిశోర్


సిద్స్ ఫామ్ ఎదుర్కొన్న కష్టతరమైన దశ ఏదైనా ఉందీ అంటే COVID-19 టైం. లాక్డౌన్, ఇన్ఫెక్షన్ లాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. ఫస్ట్ లాక్‌డౌన్ అయోమయంలో పడేసింది. కస్టమర్లు డ్రాపయ్యారు. పనివాళ్లు మానేశారు. రెవెన్యూ తగ్గింది. అయినా వెనుకడుగు వేయలేదు కిశోర్. ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోకు మరింత జోడించాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగళూరు చుట్టుపక్కల మరిన్ని జిల్లాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.