Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం- భయంతో ప్రయాణికులు పరుగు!

ABP Desam   |  Murali Krishna   |  14 Sep 2022 05:06 PM (IST)

Air India Flight: మస్కట్ నుంచి కొచ్చిన్ బయలుదేరిన ఓ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు కంగారు పడ్డారు.

(Image Source: PTI)

Air India Flight: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒకటి బుధవారం అగ్ని ప్రమాదానికి గురైంది. మస్కట్- కొచ్చిన్ సర్వీసు విమానం నుంచి సడెన్‌గా పొగ రావడంతో ప్రయాణికులంతా విమానం నుంచి దిగిపోయారు. ఈ సంఘటన మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. 

ఏఐ ఎక్స్‌ప్రెస్ బీ737 (వీటీ ఏఎక్స్‌జెడ్) విమానం మస్కట్ నుంచి కొచ్చిన్ వెళ్లేందుకు బయల్దేరబోతున్న సమయంలో రెండో నెంబరు ఇంజిన్‌లో పొగ వ్యాపించింది. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు.

నలుగురు చిన్నారులు సహా మొత్తం 145 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎవరూ గాయపడలేదు. అందరినీ సురక్షితంగా టెర్మినల్ బిల్డింగ్‌కు చేర్చినట్లు సిబ్బంది తెలిపారు.

సురక్షితం

ఎయిర్‌లైన్‌కి చెందిన ఇంజినీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేస్తోంది. ఈ ఘటనను  DGCAకి నివేదించాం. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించాం. ప్రయాణికులను కొచ్చికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నాం                      - ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 

డీజీసీఏ

మస్కట్ విమానాశ్రయంలో రన్‌వేపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (కొచ్చిన్‌కి వెళ్లేది) నం. 2 ఇంజిన్‌ నుంచి పొగ రావడం గుర్తించారు. దీంతో వెంటనే ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించి టెర్మినల్ భవనానికి తరలించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం.                                                      - డీజీసీఏ

రెండు నెలల క్రితం కాలికట్ నుంచి దుబాయ్‌కి నడిచే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మండుతున్న వాసన గమనించిన తరువాత మస్కట్‌కు మళ్లించవలసి వచ్చింది. 

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానయానంలో మెరుగైన భద్రత, పర్యవేక్షణ కోసం రెగ్యులేటర్‌కు చెందిన అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 

స్పైస్‌జెట్

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ ఈ ఏడాది చాలా చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు చెందిన 10కి పైగా విమానాలు ఈ ఏడాది వివిధ కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో 17 రోజుల్లో 7 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు చేసింది స్పైస్‌జెట్ సంస్థ. ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేపడుతోంది.

Also Read: Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Also Read: BJP Nabanna Cholo: భాజపా నిరసనల్లో హింస- పోలీసును కర్రలతో చితకబాది!

Published at: 14 Sep 2022 04:52 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.