Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABP Desam   |  Murali Krishna   |  14 Sep 2022 04:26 PM (IST)

Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకోసం లండన్ వెళ్తున్నారు.

క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల 17న ఆమె బ్రిటన్ బయల్దేరనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ నెల 19న క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఇందుకోసం ఈ నెల 17న ఆమె లండన్ బయలుదేరతారు.                                                       - విదేశాంగ శాఖ

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ నెల 19న జరుగుతాయి. దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. 

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) ఈ నెల 8న కన్నుమాశారు. తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. 

అత్యధిక కాలం

బ్రిటన్‌కు ఎలిజబెత్ 2 ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు.

ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ ఈ నెల 11వ తారీఖున జాతీయ సంతాప దినంగా పాటించింది. 

బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్‌ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read: BJP Nabanna Cholo: భాజపా నిరసనల్లో హింస- పోలీసును కర్రలతో చితకబాది!

Also Read: Viral Video: ఇదేం సెల్ఫీరా సామీ! ఫొటో తీసుకుని ఫోన్ విసిరేశాడు!

Published at: 14 Sep 2022 04:18 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.