Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించింది నోబెల్ కమిటీ. 2022 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని మానవ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తికి, సంస్థలకు సంయుక్తంగా ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.




బెలారస్​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ, రష్యన్​ మానవ హక్కుల సంస్థ అయిన 'మెమోరియల్', ఉక్రెయిన్​ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన 'సెంటర్​ ఫర్ సివిల్ లిబర్టీస్​'కు ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నట్లు వెల్లడించింది.


ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రంలో విజేతలు నోబెల్ కమిటీ ప్రకటించింది. సాహిత్య రంగంలో విజేతను గురువారం ప్రకటించారు. అక్టోబర్‌ 10న ఆర్థిక రంగంలో నోబెల్‌ విజేత పేరును వెల్లడిస్తారు. 


సాహిత్య రంగంలో


సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు ఫ్రెంచ్ రచయిత్రి 'అన్నీ ఎర్నాక్స్‌'ను వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది.


రసాయన శాస్త్రంలో


రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. 'ఇంజినీరింగ్​ టూల్స్​ ఫర్​ మాలుక్యూల్స్​ బిల్డింగ్స్​' పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో కారోలిన్‌ బెర్టోజి, మార్టిన్‌ మెల్డల్‌, బారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. 


భౌతిక శాస్త్రంలో


2022 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి వచ్చింది. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ఈ పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డును ప్రకటించింది.  



ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ  ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేశాం.                                                   "
- రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్



వైద్య రంగంలో


వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్​మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు.


మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్​ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 


డిసెంబర్‌లో


నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.


Also Read: Chief Justice UU Lalit: తదుపరి సీజేఐ ఎంపిక ప్రక్రియ షురూ- జస్టిస్ చంద్రచూడ్‌కు ఛాన్స్!