Liquor Policy Case: 3 నెలల్లో 500 సార్లు రెయిడ్ చేశారు- ఏం సాధించారు?: కేజ్రీవాల్

ABP Desam Updated at: 07 Oct 2022 01:03 PM (IST)
Edited By: Murali Krishna

Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ, పంజాబ్‌లో దాదాపు 35 ప్రదేశాల్లో ఈడీ దాడులు చేస్తోంది.

(Image Source: PTI)

NEXT PREV

Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దినేష్ అరోరా ఇల్లు, ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. దినేష్‌ అరోరాకు చెందిన అకౌంట్‌లోకి రూ. కోటి నగదు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.


ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. దినేష్ అరోరా డబ్బులు మనీశ్ సిసోడియాకు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ పాలసీ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీ, పంజాబ్‌లోని 35కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.


కేజ్రీవాల్ ట్వీట్


ఈ దాడులపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటివరకు ఈ కేసులో 500కుపైగా రెయిడ్స్ చేశారని కానీ ఏమీ పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ ఆరోపించారు.







300 మంది అధికారులు మూడు నెలలుగా 24*7 పని చేస్తూ 500 సోదాలు చేశారు. మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాలని వీరంతా ప్రయత్నించారు. కానీ ఏమీ దొరకలేదు. ఎందుకంటే అసలు ఈ కేసులో ఏం జరగలేదు. భాజపా చేసే చెత్త రాజకీయం వల్ల ఆ అధికారులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది.                                       - కేజ్రీవాల్, దిల్లీ సీఎం


ఇదీ కేసు


దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.


దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.


Also Read: Watch Video: ఆ వాచ్ విలువ రూ.27 కోట్లు- అవాక్కయ్యారా? ఇదీ సంగతి!


Also Read: US Airstrike in Syria: సిరియాలో అమెరికా వైమానిక దాడి- ఇద్దరు టాప్ ISIS ఉగ్రవాదులు హతం!

Published at: 07 Oct 2022 12:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.