Mulayam Singh Yadav Health: లైఫ్ సపోర్ట్‌పై ములాయం సింగ్ యాదవ్- తాజా హెల్త్ బులిటెన్ విడుదల!

ABP Desam Updated at: 06 Oct 2022 04:59 PM (IST)
Edited By: Murali Krishna

Mulayam Singh Yadav Health: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం విషమంగా ఉంది.

(Image Source: PTI)

NEXT PREV

Mulayam Singh Yadav Health: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగానే ఉందని మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ (82) ప్రాణాలను రక్షించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మేదాంత ఆసుపత్రి గురువారం బులెటిన్‌లో తెలిపింది.







ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాలను రక్షించే మందుల ద్వారానే ఆయన్ను ఇప్పటికీ కాపాడుతున్నాం. ప్రస్తుతం మేదాంత ఆసుపత్రిలోని ICUలో సమగ్ర నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.                   - ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌


ఖట్టర్ పరామర్శ


హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం మేదాంత ఆసుపత్రికి వచ్చారు. ములాయం సింగ్ యాదవ్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ "ములాయం ఆరోగ్యం కొంత మెరుగుపడింది.. అయితే 'రిస్క్‌ జోన్‌' నుంచి బయటపడ్డారని చెప్పలేం. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయి" అని అన్నారు.


ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 2న ములాయంను ICUకి తరలించారు.


ప్రధాని ఆరా


ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. 


రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆసుపత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి.


ములాయం సింగ్.. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో స్వయంగా పార్లమెంటుకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉండటంతో వీల్‌ ఛైర్‌లోనే పార్లమెంటుకు వచ్చారు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో జరిగిన పార్లమెంటు సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగం సమయంలో కూడా ములాయం పార్లమెంటుకు వచ్చారు. ఆ సమయంలో కూడా ములాయం సింగ్ వీల్ ఛైర్‌లోనే వచ్చారు.



Also Read: Chamchagiri Remark: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్!


Also Read: Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!


Published at: 06 Oct 2022 04:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.