హైదరాబాద్‌లో సెల్‌ఫోన్‌లు చోరీ చేసి బంగ్లాదేశ్‌, నేపాల్‌లో అమ్మే ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. బజాబ్‌ ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన చోరీ కేసును విచారించిన పోలీసులకు పెద్ద గ్యాంగే చిక్కింది. 


కుషాయిగూడ పీఎస్‌ పరిధిలోని బజాబ్‌ ఎలక్ట్రానిక్స్‌లో సెప్టెంబల్‌ 21న చోరీ జరిగింది. 70 లక్షల విలువైన 432 సెల్‌ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీఎస్, SOT, క్లూస్ టీమ్ దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. 


ఈ కేసు ఛేదించడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. సాంకేతి ఆధారలతో ఒక్కో అడుగు ముందుకేస్తూ.. 500 సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకొని విచారణ చేశారు. ఇలా కేసును విచారిస్తున్న క్రమంలో ముందుగా బిహార్, జార్ఖండ్ గ్యాంగ్‌లపై అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లే రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్టు భావించారు. 






పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మహారాష్ట్ర ఔరంగబాద్‌లో ఓ నేరస్తుడు ఫింగర్‌ ప్రింట్‌ లభించింది. దాని ఆధారంగా ఎంక్వయిరీ చేస్తే అసలు గుట్టు బయటపడింది. అతనిపై ముంబైలో కూడా నేర చరిత్ర ఉన్నట్టు కేసులు ఉన్నట్టు తెలుసుకున్నారు పోలీసులు. వీళ్లంతా ఓ గ్యాంగ్‌లా ఏర్పడి మొబైల్స్‌ దొంగతనం చేసిన వాటిని నేపాల్, బాంగ్లాదేశ్‌లో అమ్మేస్తున్నారని తేలింది. 


ఈ కేసులో సత్తార్ షేక్, ఆసీదుల్ షేక్‌ను గుర్తించిన పోలీసులు పక్కా ఆధారాలతో ఏడు రోజుల తర్వాత అరెస్టు చేశారు. 
 
మరోవైపు హయత్ నగర్ లో 2కోట్ల 80 లక్షల గంజాయి సీజ్ చేశారు రాచకొండ పోలీసులు. 1300 కిలోల గంజాయి తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేశారు. ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ మీదుగా మధ్యప్రదేశ్ కి ఈ మత్తుపదార్థాన్ని తరిలిస్తున్నారు. పెద్ద అంబర్ పేట్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా గుట్టు వెలుగు చూసింది. హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక , మహారాష్ట్రలో గంజాయికి బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ 2 వేలకు కిలో కొనుగోలు చేసి, అక్కడ 15 వేలు నుంచి 20 వేలుకు అమ్మకాలు చేస్తున్నారు.